iDreamPost

ఆచార్యను వాడుకోబోతున్న సల్మాన్ ఖాన్

ఆచార్యను వాడుకోబోతున్న సల్మాన్ ఖాన్

అదేంటి డిజాస్టర్స్ గా చెప్పుకున్న ఆచార్యని కండల వీరుడు వాడుకోవడం ఏమిటనుకుంటున్నారా. అసలు కథ వేరే వేరే ఉంది. సల్మాన్ ఖాన్ హీరోగా కభీ ఈద్ కభీ దివాలి షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. రెగ్యులర్ షెడ్యూల్స్ త్వరలోనే ప్లాన్ చేయబోతున్నారు. కథలో కీలక భాగం ఒక గ్రామంలో సాగుతుంది. దాని కోసం ప్రత్యేక సెట్ అవసరమయ్యింది. గాడ్ ఫాదర్ టైంలో దీని గురించి తెలుసుకున్న చిరంజీవి తాము వేసిన ధర్మస్థలి సెట్ ని చూసి ఒకవేళ ఉపయోగపడుతుందనుకుంటే వాడుకోమని చెప్పారు. దీంతో సల్మాన్, దర్శకుడు ఫర్హాద్ సంజీ పాదఘట్టంని సందర్శించి చూడగానే నచ్చడంతో దాన్ని తమకు అనుగుణంగా వాడుకోవాలని ఫిక్స్ అయ్యారు.

సో జూన్ నుంచి అక్కడే షూట్ ఉంటుందన్న మాట. నిజానికది మంచి సెట్టే. కాకపోతే పాదఘట్టం, ధర్మస్థలి అని సినిమాలో పదే పదే చెప్పించి చిరాకు తెప్పించడంతో ఆర్ట్ డైరెక్టర్ గొప్పదనం జనానికి కనెక్ట్ కాలేకపోయింది. అప్పట్లో మహేష్ బాబు అర్జున్ ఫ్లాప్ అయినప్పటికీ కంచి కామాక్షి గుడిని పునఃసృష్టించిన తీరు గురించి ఆడియన్స్ గొప్పగా మాట్లాడుకున్నారు. దీనికోసమైనా ఓసారి చూడొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆచార్యకు అలా జరగలేదు. అసలు కంటెంట్ తేడా కొట్టడంతో గుడి గురించి ఆ నైపుణ్యం గురించి ఎవరూ నోరెత్తలేదు. ఇప్పుడు సల్మాన్ కైనా ఇది పనికొస్తుండటం ఎంతో కొంత ఊరట కలిగించేదే

కభీ ఈద్ కభి దివాలికి మొదట్లో చాలా అడ్డంకులు వచ్చాయి. ఒకదశలో క్యాన్సిల్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. కానీ ఫైనల్ గా సల్మాన్ చొరవతో పట్టాలెక్కించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. వెంకటేష్ తనకు అన్నయ్యగా నటించబోతున్నాడని టాక్ ఉంది కానీ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. సల్మాన్ వెంకీలకు ఫ్రెండ్ షిప్ చాలా పాతది. పలుమార్లు కలుసుకుంటూనే ఉంటారు. అందుకే దీనికి ఒప్పుకుని ఉండొచ్చు. గాడ్ ఫాదర్ లో క్యామియో చేయడం ద్వారా తెలుగు ఆడియన్స్ కి మొదటిసారిగా స్ట్రెయిట్ టాలీవుడ్ మూవీలో కనిపించనున్న సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమాలో మన స్టార్ హీరోని భాగం చేసుకోవడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి