iDreamPost

తీరని పాకీజా కష్టాలు! మరోసారి భిక్షాటన చేస్తూ..!

తీరని పాకీజా కష్టాలు! మరోసారి భిక్షాటన చేస్తూ..!

తెలుగు ప్రేక్షకులను తన కామెడీతో కితకితలు పెట్టించిన అతి కొద్ది మంది హాస్యనటీమణుల్లో ఒకరు పాకీజా అలియాస్ వాసుకి. మోహాన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజా, బ్రహ్మానందం కాంబో నవ్వులు పువ్వులు పూయిస్తుంది. ఆ తర్వాత అనేక సినిమాల్లో మెప్పించింది. కోలీవుడ్‌లో ఎక్కువ సినిమాల్లో కనిపించింది. 90వ దశకంలో బిజీయెస్ట్‌  లేడీ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.  ఆ తర్వాత పలు కారణాలతో సినిమా పరిశ్రమకు దూరమైంది పాకీజా. తమిళనాడులో నివాసముంటుంది. అయితే దీపం ఉండగానే ఇళ్లు చక్కబెట్టుకోవాలని తెలియకపోవడంతో ఆమెను ఆర్థిక ఇబ్బందులు వెంటాడాయి. తిరిగి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించినప్పటికీ మొండి చేయి ఎదురైంది. దీంతో ఆమె పూట గడవని దీన స్థితిలోకి వెళ్లిపోయింది. సాదా సీదా జీవితం గడుపుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యలను చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకోగా.. టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు.

మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి, నాగబాబు ఆమెకు తలో లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. అలాగే మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెకు గుర్తింపు కార్డు ఇచ్చారు. తిరిగి తన ఆర్థిక ఇబ్బందులు  తీరాయని, హైదరాబాద్ మకాం మార్చింది పాకీజా. అద్దె ఇంట్లో జీవిస్తున్నారు. అయితే జబర్ధస్త్, కొన్ని సీరియల్స్ చేసినప్పటికీ ఆమె ఆర్థిక కష్టాలు తీరలేదు. కాగా, ఆమెకు అవకాశాలు కూడా అంతంత మాత్రమే వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దె కూడా కట్టలేని దీన స్థితిలో ఉన్నారు. దీంతో ఆమె భిక్షాటన చేస్తూ పలువురికి కనిపించింది. తిరుపతిలోని దుకాణాల యజమానులు డబ్బులు అడుగుతూ దర్శనమిచ్చింది. ఆమెను చూసి గుర్తు పట్టిన కొందరు డబ్బులిస్తున్నారు. మరికొంత మంది ఆమెకు ఇదేం పరిస్థితి అంటూ వాపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, సినిమా అవకాశాలు కూడా లేకపోవడంతో తన కడుపు నింపుకునేందుకు, ఇతర అవసరాలు తీర్చుకునేందుకు భిక్షాటన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పరిస్థితి చూసి చాలా మంది డబ్బులు ఇస్తున్నారు. ఏదేమైనా.. తన కామెడీ నటనతో మెప్పించిన ఓ నటి.. ఇప్పుడు రోడ్డుపై భిక్షాటన చేస్తుండటం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొంత మంది బాధను వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి