iDreamPost

అనూహ్య వాతావరణం.. వరుస తుఫాన్లు..

అనూహ్య వాతావరణం.. వరుస తుఫాన్లు..

అనూహ్య వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరుసగా తుఫాన్లు దాడి చేస్తున్నాయని వాతావరణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఏకధాటి వర్షాలు.. ఆ తరువాత నివర్‌.. బురేవి.. ఇప్పుడు ఆర్నబ్‌ వంతు అంటున్నారు.

ఒక పక్క బురేవీ ప్రభావం వీడకముందే కొత్తగా ఆర్నబ్‌ పేరుతో మరో తుఫాను ముంచుకొస్తోందని విశ్లేషిస్తున్నారు. బంగాళాఖాతం, అరేబియా మహాసముద్ర, హిందూ మహాసుముద్రాల్లోని ఉపరితల వాతావరణంలో తుఫాన్లు ఏర్పడేందుకు అనుకూలమైన వాతావరణం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా వెనువెంటనే తుఫాన్లు మొదలవుతున్నాయంటున్నారు. ఇలా వరుసగా రావడం అరుదుగానే చెప్పాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఇప్పుడు కొత్తగా ఏర్పడిన అల్పపీడనం కారణంగా 7,8 తేదీల్లో భారీ వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. మరింత బలపడి వాయుగుండంగా మారుతుందన్నారు. కేరళ, కర్నాటకలకు దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఇదిలా ఉండగా నివార్‌ తుఫాను ఆంధ్రా, తమిళనాడుల్లో విధ్వంసం సృష్టించగా, బురేవి తుఫాను తమిళనాడును అతలాకుతలం చేసేసింది. ఆయా ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండగానే, మరో తుఫాను ఏర్పడడంతో ఆయా రాష్ట్రాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పుడు వస్తున్న ఆర్నబ్‌ కారణంగా కేరళ, తమిళనాడులకు ఎక్కువ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి