iDreamPost

క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్న ధృవ విలన్

క్రేజీ ప్రాజెక్ట్ తో రాబోతున్న ధృవ విలన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా నాలుగేళ్ల క్రితం 2016లో విడుదలైన ధృవలో విలన్ గా చేసిన అరవిందస్వామి గుర్తున్నాడుగా. చాలా స్టైలిష్ గా అంతకన్నా కన్నింగ్ గా చూపులతోనే భయపెట్టే విలనీని చూసి పాతికేళ్ళ క్రితం రోజా, బొంబాయిలో చూసిన అందమైన కుర్రాడు ఇతనేనా అని డౌట్ వచ్చే లెవెల్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. తమిళ ఒరిజినల్ వెర్షన్ తని ఒరువన్ లో చూశాకే అరవిందస్వామినే కావాలని పట్టుబట్టి మరీ తీసుకొచ్చాడు దర్శకుడు సురేందర్ రెడ్డి.

ధృవ సక్సెస్ తర్వాత ఇతనికి టాలీవుడ్ లో చాలా అవకాశాలు వచ్చాయి కాని తమిళ్ లోనే బిజీ అయిపోయాడీ ట్రెండీ విలన్. మళ్లి ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ కోసం ప్రతినాయకుడిగా నటించబోతున్నట్టు ఫ్రెష్ అప్ డేట్. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందబోయే సైన్స్ ఫిక్షన్ సినిమా కోసం ఇతన్నే విలన్ గా ఎంచుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. డైరెక్టర్ ఇటీవలే నెరేషన్ ఇచ్చాడని పూర్తి కథ విన్న అరవింద స్వామి వెంటనే ఎక్కువ ఆలస్యం చేయకుండా ఓకే చెప్పినట్టుగా తెలిసింది. అయితే షూటింగుల విషయంలో దేశం మొత్తం అనిశ్చితి నెలకొంది కాబట్టి డేట్స్ తర్వాత ఫైనల్ చేద్దామని చెప్పినట్టుగా వినికిడి.

ఒకప్పుడు హీరోగా తన అందంతోనే ఫాలోయింగ్ పెంచుకున్న అరవిందస్వామి డబ్బింగ్ సినిమాలతోనే మనకు పరిచయం. బొంబాయి తర్వాత తెలుగులో నగ్మా హీరొయిన్ గా మౌనం అనే మూవీ చేశాడు కాని అది డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఇక్కడ స్ట్రెయిట్ మూవీ చేయనే లేదు. కోలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న ఆర్టిస్టుల్లో అరవిందస్వామి ఒకరు. అయినా కూడా ప్రభాస్ సినిమాకు చేస్తానని చెప్పారంటే కథలో గట్టి విషయమే ఉన్నట్టుంది. అధికారిక ప్రకటన రావడానికి చాలా టైం పడుతుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కరోనా వల్ల బ్రేక్ పడింది కాబట్టి దాని తర్వాతే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి
 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి