iDreamPost

దేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా

దేశంలో ఉగ్రరూపం దాలుస్తున్న కరోనా

ఒక్కరోజులో 3,390 పాజిటివ్ కేసులు – 103 మరణాలు

దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. గడచిన మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా దాదాపు 10వేల పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడం వల్ల దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగింది. నిన్న ఒక్కరోజులో 3,399 పాజిటివ్ కేసులు నిర్దారణ కావడంతో  దేశంలో కరోనా పాజిటివ్ కేసుల 56342కు చేరింది. కాగా కరోనా కారణంగా 1886 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 16540 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 37,916 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. కొత్తగా 1,216 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా 43 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో 17,974 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 694 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.ఒక్క ముంబైలోనే 11 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. గుజరాత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటివరకు 7012 కేసులు నమోదవ్వగా, 425 మంది మృతిచెందారు. నిన్న ఒక్కరోజులోనే 387 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.తమిళనాడులో గత మూడురోజులుగా వైరస్‌ విజృంభణ అనూహ్యంగా పెరిగింది. కేవలం నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 580 కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 5409కి చేరగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో 1122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కొత్తగా 15 కేసులు నిర్దారణ అయ్యాయి. 29 మంది మృత్యువాత పడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1833 మందికి కరోనా సోకగా 38 మంది మృత్యువాత పడ్డారు. నిన్న 56 కరోనా పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా 3,917,944 మందికి కోవిడ్ 19 సోకగా 270,740 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,344,260 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,292,850 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 76,938 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి