iDreamPost

నివర్‌ ఫియర్‌ : రైతులకు సీఎం భరోసా..

నివర్‌ ఫియర్‌ : రైతులకు సీఎం భరోసా..

నివర్‌ తుపాను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలలో జరుగుతున్న రక్షణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుపాను ప్రభావం రాష్ట్రంలో ఏ స్థాయిలో ఎక్కెడెక్కడ ఉందో సీఎంవో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తుపాను ప్రభావం నెల్లూరు జిల్లాలపై అధికంగా ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. నెల్లూరు సగటును ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసిందని వివరించారు. గత మూడు రోజులుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నారు. తీరం దాటిన నివర్‌ తుపాను క్రమేపీ బలహీనపడుతోందని వివరించారు.

తుపాను సహాయక చర్యలను నిరంతరం కొనసాగించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 24 గంటలూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో విద్యుదాఘాతంలో మరణించిన కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని అధికారులకు సూచించారు.

తుపాను ప్రభావిత జిల్లాల్లో పంటల పరిస్థితిపై సీఎం ప్రధానంగా ఆరా తీశారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతింటే నష్ట ముదింపును వర్షాలు తగ్గిన వెంటనే చేపట్టాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించేలా అధికారులు పని చేయాలని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి