iDreamPost

ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్‌’, ఏంపీ నియోజ‌క‌వ‌ర్గానికో మెడిక‌ల్ కాలేజ్, డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌

ఏపీలో ప్రతీ కుటుంబానికి ‘ఫ్యామిలీ డాక్టర్‌’, ఏంపీ నియోజ‌క‌వ‌ర్గానికో మెడిక‌ల్ కాలేజ్,  డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌

దావోస్‌, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రెండో రోజు (సోమవారం) ఫ్యూచర్‌ ఫ్రూఫింగ్‌ హెల్త్‌ సిస్టమ్స్‌ అంశంపై మాట్లాడారు. డబ్ల్యూఈఎఫ్‌ పబ్లిక్‌ సెషన్‌లో పాల్గొన్న సీఎం, ఏపీలో కోవిడ్‌ నియంత్రణకు తీసుకున్న చర్యలతో పాటు, వైద్య వ్యవస్థలు ఎలా బలోపేతం చేస్తున్నారో ఫోర‌మ్ ముందుంచారు.

ప్ర‌తి ఫ్యామిలీకో డాక్ట‌ర్

వ్యాధులు రాకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. ఒక‌వేళ వ‌స్తే సరైన సమయంలో వైద్యం చేయ‌డం కీలకమైన అంశం. ఈ రెండింటిని ఆధారంగా చేసుకుని, ఏపీలో హెల్త్‌కేర్‌ సిస్టమ్‌ని రెడీ చేశాం. రాష్ట్రంలో రెండు వేల జనాభా ఉన్న‌ గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. వీటిపైన ప్రతీ 13 వేల జనాభా మండలం యూనిట్‌గా, రెండు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పాం. ఇందులో నలుగురు డాక్టర్లు ఉంటారు. అంటే ప్రతీ పీహెచ్‌సీకి ఇద్దరు డాక్టర్లు. ఈ పీహెచ్‌సీలకు అనుబంధంగా 104 అంబులెన్సులు రెడీగా ఉంటాయి. పీహెచ్‌సీలో ఉన్న డాక్టర్లకు, కొన్ని గ్రామాల చొప్పున‌ బాధ్యతలను అప్పగించాం. రోజు విడిచి రోజు ఈ డాక్టర్లు, అంబులెన్సుల్లో ఆయా గ్రామాలకు వెళ్తారు. వీరంతా ఆ గ్రామంలోని ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్లుగా త‌యార‌వుతారు. ప్రతీ ఒక్కరి హెల్త్‌ ప్రొఫైల్‌ డాక్టర్లకు తెలుస్తుంది. దానివల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒక‌వేళ వ‌చ్చినా తొలి దశలోనే, చికిత్స అందించే వీలు ఉంటుంది.

44 ఇళ్లు ఒక యూనిట్‌గా, ఇంటింటికి సర్వే చేశాం. ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ వంతున పని చేశారు. 42 వేల మంది ఆశావర్కర్లు ఇందులో భాగ‌స్వాములు. ఇంటింటికి వెళ్లి, కోవిడ్‌ లక్షణాలు కనిపించిన వారిని గుర్తించాం. ప్రత్యేకంగా ఐసోలేషన్‌ సెంటర్లు ఏర్పాటు చేశాం. మెడిసిన్స్‌ అందించాం. పౌష్టిక ఆహారం అందిస్తూ పకడ్బందీ ప్రణాళిక అమలు చేశాం. అందువల్లే కరోనా మరణాల రేటు ఏపీలో జాతీయ స్థాయి కన్నా చాలా తక్కువగా దేశంలోనే త‌క్కువ‌గా, 0.6 శాతంగా నమోదు అయ్యింది.

వైద్య వ్యవస్థ బలోపేతం
మండల స్థాయి దాటి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, టీచింగ్‌ హాస్పటిల్స్ ట్రీట్ చేస్తాయి. ప్రతీ ఎంపీ నియోజ‌క‌గ‌ర్గం యూనిట్‌గా, మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. వీటికి అనుబంధంగా టీచింగ్‌ కాలేజీలు వస్తాయి. అక్కడ పీజీ స్టూడెంట్స్‌ ఉంటారు. వీళ్లంతా హెల్త్‌కేర్‌లో భాగమవుతారు. దీని ద్వారా హెల్త్‌కేర్‌ సిస్టమ్ మ‌రంత‌గా బలోపేతం అవుతుంది.

మా ప్రభుత్వం రావడానికి ముందు 11 మెడికల్‌ కాలేజీలు ఉంటే, కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేశాం. ప్రతీ పార్లమెంటు నియోజకవర్గం ఒక యూనిట్‌గా, మెడికల్‌ కాలేజీలుంటే అన్ని చోట్ల వైద్యవ్యవస్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ఇప్పటికే రెండు బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ కేటాయించాం. మూడేళ్లలో ఫలితాలు అందుతాయని సీఎం జగన్‌ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి