iDreamPost

1.5 లక్షల విలువైన మంగళసూత్రం మింగిన గేదె!

1.5 లక్షల విలువైన మంగళసూత్రం మింగిన గేదె!

పెళ్లి రోజున ఓ గేదె మహిళకు షాక్‌ ఇచ్చింది. భారతీయ స్త్రీలు ఎంతో పవిత్రంగా భావించే మంగళసూత్రాన్ని మింగేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని వాషిమ్‌లో ఆలస్యంగా వెలుగుచూపింది. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని వాషిమ్‌కు చెందిన ఓ మహిళ స్నానం చేయడానికి సిద్ధమైంది. స్నానానికి ముందు తన మంగళసూత్రాన్ని తీసి సోయా బీన్స్‌, వేరు శనగల తొక్కలు ఉన్న ప్లేటులో పెట్టింది. తర్వాత స్నానానికి వెళ్లింది.

కొన్ని నిమిషాల తర్వాత మంగళ సూత్రం పెట్టిన దగ్గరకు వచ్చి చూసింది. ఆ ప్లేటు అది కనిపించలేదు. ఎక్కడ పెట్టి మర్చిపోయానా అనుకుంటూ అంతా తిరగసాగింది. కొద్దిసేపటి తర్వాత ఆ మంగళసూత్రం ఎక్కడ పెట్టిందో గుర్తుకు వచ్చింది. ప్లేటు ఉన్న పరిసర ప్రాంతాల్లో మొత్తం వెతికింది. అయినా మంగళసూత్రం కనిపించలేదు. దీంతో అక్కడే ఉన్న గేదెపై ఆమెకు అనుమానం వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. తాళి బొట్టు పోతే పోయింది.. గేదెకు ఏమీ కాకూడదని వారు ఆలోచించారు.

వెంటనే దాన్ని పశు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. మెటల్‌ డిక్టేటర్‌ సాయంతో వైద్యుడు టెస్ట్‌ చేయగా.. అది గేదె కడుపులోనే ఉన్నట్లు తేలింది. మంగళసూత్రం దానంతట అది బయటకు వచ్చే అవకాశం లేని కారణంగా.. ఆపరేషన్‌ చేశాడు వైద్యుడు. కడుపులోంచి దాన్ని బయటకు తీశాడు. ఈ ఆపరేషన్‌ కోసం 2నుంచి 3 గంటల సమయం పట్టింది. గేదెకు దాదాపు 60కిపైగా కుట్లు పడ్డాయి. ఆ గేదె మింగిన మంగళసూత్రం విలువ 1.5 లక్షల రూపాయలుగా తెలుస్తోంది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి