iDreamPost

మాస్ దర్శకులతో అదిరిపోయే లైనప్

మాస్ దర్శకులతో అదిరిపోయే లైనప్

సీనియర్ దర్శకులను నమ్ముకుంటే లాభం లేదని గుర్తించిన బాలకృష్ణ ఎట్టకేలకు ఇప్పటి జెనరేషన్ డైరెక్టర్లను సెట్ చేసుకుంటూ పక్కా ప్లానింగ్ తో సాగుతున్నారు. అఖండ ఇంకో రెండు పాటలు మాత్రమే బాలన్స్ ఉన్న నేపథ్యంలో నెక్స్ట్ చేయబోయే గోపిచంద్ మలినేని ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. ఇది కూడా క్రాక్ తరహాలో పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని ఇప్పటికే టాక్ ఉంది. వరలక్ష్మి శరత్ కుమార్ ని క్యాస్టింగ్ లో సెట్ చేయగా హీరోయిన్ కోసం వేట తీవ్రతరంగా సాగుతోంది. మైత్రి సంస్థ దీని కోసం భారీ బడ్జెట్ నే కేటాయించింది. రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి ఉంటుందనే క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదయ్యాక అనిల్ రావిపూడితో బాలకృష్ణ సినిమా ఉండటం కన్ఫర్మ్ అయ్యింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఇది రూపొందనుంది. టక్ జగదీశ్ ప్రమోషన్లలో భాగంగా మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో నిర్మాతలు ఆ మేరకు ఖరారు చేశారు. అనిల్ ప్రస్తుతం ఎఫ్3తో బిజీగా ఉన్నాడు. ఎంతలేదన్నా ఇంకో మూడు నెలల్లో పూర్తవుతుంది.సంక్రాంతి రిలీజ్ అయినా కాకపోయినా ఫస్ట్ కాపీ అయితే సిద్ధం చేసి ఉంచబోతున్నారు. ఆ తర్వాత రావిపూడి బాలయ్య సినిమాతో బిజీ అయిపోతాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. తమ హీరో సెట్ చేసుకుంటున్న కాంబోల పట్ల అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు.

పటాస్, రాజా ది గ్రేట్, సుప్రీమ్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరులతో ఇప్పటిదాకా ఫ్లాప్ అనేది ఎరుగని అనిల్ రావిపూడి బాలయ్యని ఏ రేంజ్ లో చూపిస్తాడో ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు, రూలర్ డిజాస్టర్ల తాలూకు గాయాల నుంచి అఖండ పూర్తిగా బయటపడేలా చేస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. మాస్ పల్స్ ని సరిగ్గా పట్టుకుని ప్రెజెంట్ చేయగలిగితే బాలకృష్ణ వసూళ్ల వర్షం కురిపించడం ఖాయమని సింహ, లెజెండ్ లాంటి సినిమాలు ఋజువు చేశాయి. సో బోయపాటి శీను, గోపిచంద్ మలినేని, అనిల్ రావిపూడి ఇలా హ్యాట్రిక్ లైన్ అప్ చూస్తుంటే బాలయ్య మాస్ సునామి మాములుగా ఉండేలా లేదు

Also Read : బుల్లితెరపై అదరగొట్టిన చిన్న సినిమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి