iDreamPost

బాక్సాఫీస్ జోష్ సరిపోవడం లేదు

బాక్సాఫీస్ జోష్ సరిపోవడం లేదు

ఇవాళ్టితో థియేటర్లు తెరుచుకుని 30 రోజులు అయ్యింది. దేశవ్యాప్తంగా ఎక్కడా ఏ భాషలోనూ లేని స్థాయిలో మన దగ్గర ప్రతి వారం సినిమాలు రిలీజవుతూనే ఉన్నాయి. చిన్నవో పెద్దవో కనీసం ధైర్యం చేసి హాళ్ల దాకా వచ్చాయి. అయితే ఇన్ని విడుదలయ్యాయి కదా మరి బాక్సాఫీస్ కళకళలాడుతూ హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయా అంటే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే కౌంట్ అయితే భారీగా ఉన్నాయి కానీ కంటెంట్ విషయంలో చాలా మటుకు వీక్ గా ఉండటం వల్ల కేవలం కొన్ని మాత్రమే విజయం సాధించగలిగాయి. అవి కూడా బడ్జెట్ పరంగా రిస్క్ లేనివి కావడంతో లాభాలు వచ్చాయి తప్ప పదుల కోట్ల పెట్టుబడి పెట్టినవి వీటిలో లేవు.

జులై 30 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా వచ్చిన చెప్పుకోదగ్గ సినిమాలు తిమ్మరుసు, ఇష్క్, ఎస్ఆర్ కళ్యాణ మండపం, ముగ్గురు మొనగాళ్లు, మెరిసే మెరిసే, మ్యాడ్, పాగల్, రాజరాజచోర, కనబడుట లేదు, క్రేజీ అంకుల్స్, శ్రీదేవి సోడా సెంటర్, ఇచట వాహనములు నిలుపరాదు, హౌస్ అరెస్ట్. అసలు కనీస మార్కెటింగ్ చేసుకోనివి, వచ్చాయా లేదా అని అనుమానం వచ్చేలా ఒకటి రెండు రోజుల్లో మాయమైనవి ఇంకో పదికి పైనే ఉంటాయి. ఇక్కడ డబ్బింగ్ మూవీస్ ని కలపలేదు. అన్నీ స్ట్రెయిట్ చిత్రాలే. మూడు మాత్రమే నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు ఇచ్చాయి. శ్రీదేవి సోడా సెంటర్ వచ్చి రెండు రోజులే అయ్యింది కాబట్టి ఇంకా నిర్ధారణకు రాలేం

ఇవన్నీ ఫీడింగ్ కోసం వస్తున్నట్టు ఉంది కానీ నిజానికి జనాలు థియేటర్లకు మునుపటిలా రావడం లేదన్నది వాస్తవం. థర్డ్ వేవ్ తాలూకు అనుమానాలు భయాలు పబ్లిక్ లో ఉన్నాయి. ఫ్యామిలీస్ ని తీసుకుని ప్రేక్షకులు హాలుకు రావడానికి పూర్తి స్థాయిలో ధైర్యం చేయలేకపోతున్నారు. దానికి తోడు క్రౌడ్ ఫుల్ చేసే ఇమేజ్ ఉన్న హీరో సినిమా ఒక్కటంటే ఒక్కటి రాకపోవడం ఎగ్జిబిటర్లను నిరాశపరుస్తోంది. సుధీర్ బాబు ఈ కారణంగానే ఆశించిన దానికన్నా తక్కువ ఓపెనింగ్స్ తెచ్చాడు. సో 10న సీటిమార్ వచ్చేదాకా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. 3న కూడా చెప్పుకోదగ్గ చిత్రాలేవీ లేవు కనక వెయిటింగ్ గేమ్ కొనసాగాల్సిందే

Also Read : రిలీజ్ మార్పు వెనుక ఎన్నో లెక్కలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి