iDreamPost

నిరూపిస్తే రాజీనామా చేస్తా : బీజేపీ ఎంపీ జీవీఎల్‌

నిరూపిస్తే రాజీనామా చేస్తా : బీజేపీ ఎంపీ జీవీఎల్‌

అమరావతి రాజధాని, శాసన మండలి రద్దు వ్యవహారాల్లో తమకు కొరగాని కొయ్యలా తయారైన బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరశింహారావును ఇటీవల టీడీపీ టార్గెట్‌ చేసింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రకటనలకు భిన్నంగా కేంద్ర వైఖరిని జీవీఎల్‌ వెల్లడిస్తూ.. టీడీపీ నేతలను ఇరకాటంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జీవీఎల్‌కు వైఎస్సార్‌సీపీతో లోపాయికారి ఒప్పదం ఉందని, వైఎస్సార్‌సీపీ ఏజెంట్‌గా ఉన్నారని…ఇలా టీడీపీ నేతలు అనేక ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపై జీవీఎల్‌ టీడీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు ఓ టీవీ చానెల్‌తో జీవీఎల్‌ మాట్లాడుతూ.. తనపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు నిరూపించాలని సవాల్‌ విసిరారు. నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. వైఎస్సార్‌సీపీయే కాదు ఎవరి వద్దనైనా సరే.. తాను కప్పు కాఫీ, గ్లాసు నీళ్లు తప్పా మరేదీ తీసుకోలేదన్నారు. అంతకు మించి మరేదైనా తీసుకున్నానని నిరూపిస్తే.. అవన్నీ తెలుగు జర్నలిస్టులకు ఇస్తానని చమత్కరించారు.

తనపై బురద చల్లితే భయపడడానికి తాను తప్పులు చేసేవాడిని కాదని జీవీఎల్‌ అన్నారు. చేతగాని మనుషులు ఇలాంటి పనులు చేస్తే.. వారి బండారం మొత్తం బయటపెడతానని టీడీపీ నేతలను హెచ్చరించారు. ఆరోపణలు, విమర్శలు చేస్తే.. వెనక్కి తగ్గేందుకు తాను గోతులు తవ్వడంలేదని టీడీపీ నేతలకు చురకలంటించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి