iDreamPost

Bhagyasree : కూతుర్ని పరిచయం చేయనున్న ప్రేమపావురాలు హీరోయిన్

Bhagyasree : కూతుర్ని పరిచయం చేయనున్న ప్రేమపావురాలు హీరోయిన్

హీరోల వారసులు పరిచయమైనప్పుడు ఉన్నంత ఎగ్జైట్ మెంట్ హీరోయిన్ల కూతుళ్లు ఎంట్రీ ఇస్తున్నప్పుడు అంతగా ఉండదు. ఇది చాలా సార్లు ఋజువయ్యింది. ఒకప్పుడు చిరంజీవికి ధీటుగా డాన్సులేసి యువత మతులు పోగొట్టిన రాధ తన బిడ్డ కార్తీకను ఇండస్ట్రీ తీసుకొచ్చినా ప్రయోజనం కలగలేదు. జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య లాంటి స్టార్ హీరోల సినిమాలు చేసినా లాభం లేకపోయింది. ఇప్పుడు భాగ్యశ్రీ వంతు వచ్చింది. 1989 బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ మైనే ప్యార్ కియా ద్వారా పరిచయమై అప్పటి యువతకు ఎన్నో ఏళ్ళు కలల రాణిగా మిగిలిపోయిన భాగశ్రీని అంత సులభంగా మర్చిపోగలమా. కబూతర్ జాజా పాట గుర్తుకు రాకుండా ఉంటుందా.

తక్కువ టైంలోనే పెళ్లి చేసుకుని తన భర్తను హీరోగా పెట్టి సినిమాలు తీస్తేనే నటిస్తాననే అర్థం లేని కండీషన్ పెట్టి కెరీర్ ని చేతులారా చెడగొట్టుకున్న భాగ్యశ్రీ అడపాదడపా తెలుగులో నటిస్తూనే ఉంది. రాజశేఖర్ ఓంకారంతో రీ ఎంట్రీ ఇచ్చాక మళ్ళీ గ్యాప్ తీసుకుంది. ఇటీవలి కాలంలో ప్రభాస్ రాధే శ్యామ్ లో ఓ కీలక పాత్ర చేస్తున్న ఈ సీనియర్ నటీమణి తలైవిలో కూడా నటించింది కానీ అది డిజాస్టర్ కావడంతో ఎవరికీ గుర్తు లేకుండా పోయింది. ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఆమె వారసురాలు అవంతిక దస్సాని హిందీలో బదులు తెలుగులోనే తెరంగేట్రం చేయబోతోంది. అది కూడా తల్లి ఇచ్చిన సలహా ప్రోత్సాహంతోనే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్ హీరోగా నటించబోయే ఓ సినిమా ద్వారా అవంతికను లాంచ్ చేయబోతున్నారని తెలిసింది. నాంది నిర్మాత సతీష్ వేగేశ్న చేయబోయే ప్రాజెక్ట్ ద్వారా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయని వార్త. త్వరలోనే అఫీషియల్ గా చెప్పొచ్చు. అసలే హీరోయిన్ల కొరతతో సతమతమవుతున్న టాలీవుడ్ కు ఇప్పుడు కొత్తవాళ్ల అవసరం చాలా ఉంది. ఉన్నవాళ్లతో సర్దుకోలేక దర్శక నిర్మాతలు కిందా మీద పడుతున్నారు. లుక్స్ పరంగా చూస్తే అవంతిక ఆకట్టుకునేలానే ఉంది. హిందీలో ఆఫర్లు వచ్చినా వద్దనుకుంది. మరి డెబ్యూ సరిగా పడి హిట్ అందుకుంటే ఇక్కడే మంచి కెరీర్ ని దక్కించుకోవచ్చు.

Also Read : Bangarraju : బంగార్రాజు వెనుక అసలు గుట్టు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి