iDreamPost

తెలుగుదేశం నిర్వాకంతో బీసిల్లో తీవ్ర అసంతృప్తి

తెలుగుదేశం నిర్వాకంతో బీసిల్లో తీవ్ర అసంతృప్తి

స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షం వ్యవహరించిన తీరుతో రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలు (బీసి లు) 9.85 శాతం రిజర్వేషన్లు కోల్పోతున్నారు. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో 59.85% రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్‌ సర్కార్‌ నిర్ణయం నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 59.85 శాతం రిజర్వేషన్ల అమలుకు డిసెంబర్‌లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు.

జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్నయాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టు ని ఆశ్రయించగా పిటిషనర్ల వాదనని తోసిపుచ్చుతూ ఆ మేరకు పెరిగిన 59.8 శాతం రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలను నిర్వహించుకొనేందుకు తొలుత హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాలుచేస్తూ టిడిపికి చెందిన నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్‌ గౌరవాధ్యక్షుడిగా ఉన్న ప్రయివేట్ సంఘం ఐన ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌ (ఏపీపీసీ) లో ఈ బిర్రు ప్రతాప్‌రెడ్డి ప్రధాన కార్యదర్శి గా వ్యవహరిస్తున్నాడు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ బిర్రు ప్రతాప రెడ్డి అనే వ్యక్తికి ఓ నామినేటెడ్‌ పదవిని కూడా కట్టబెట్టింది. ఉపాధి హామీ పథకం అమలు తీరు పర్యవేక్షించే రాష్ట్ర కౌన్సిల్‌ (ఏపీ ఎస్‌ఈజీసీ) సభ్యుడిగా నియమిస్తూ 2019 మార్చి 9వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.

సోమవారం హైకోర్టు రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో బీసిల కొటా కి మాత్రమే కోత పడనుంది. బీసీలకే ఎందుకుతగ్గుతున్నాయంటే రాజ్యాంగ ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం జనాభా నిష్పత్తిన రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉన్నందున వారి రిజర్వేషన్లు తగ్గించే వీలు లేదు. దీనితో 59.82 శాతం ఉన్న రిజర్వేషన్లు 50 శాతానికి తగ్గించడం వల్ల 9.85 శాతం మేర బీసీలకు మాత్రమే రిజర్వేషన్లు తగ్గించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

దీంతో తెలుగుదేశం నిర్వాకం వల్ల బీసీలు 9.85 శాతం మేర నష్టపోతున్నారు. తద్వారా వారికి దక్కాల్సిన నాలుగు జెడ్పీ చైర్మన్‌ పదవుల్లో ఒకటి కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటితోపాటు 65 మండల పరిషత్‌ అధ్యక్ష స్థానాలు, 65 జెడ్పీటీసీ పదవులతో పాటు సర్పంచి పదవులు, వార్డు సభ్యుల పదవులతో కలిపి మొత్తంగా 15,000 కు పైగా పదవులు బీసీల చేజారాయి.

ఈనేపధ్యంలో స్థానికఎన్నిలకల్లో పోటీ చేద్దామని ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న బీసి ఆశావాహులందరు టిడిపి వ్యవహార శైలితో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఒకప్పుడు తెలుగుదేశానికి అండగా నిలబడి రాజకీయంగా తెలుగుదేశానికి వెన్నెముకలా ఉన్న బిసిలు క్రమేపి ఆ పార్టీ నుండి దూరమౌతున్నారని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రుజువైందని, అయినప్పటికీ చంద్రబాబు వైఖరిలో ఎటువంటి మార్పు రాలేదని స్వయంగా ఆ పార్టీకి చెందిన బీసి నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తాజా పరిణామాలతో రానున్న రోజుల్లో తెలుగుదేశం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పలు బీసీ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి