iDreamPost

బాబు నోట మళ్లీ ఆ మాట.. ప్రజలు కొడతారేమో..?

బాబు నోట మళ్లీ ఆ మాట.. ప్రజలు కొడతారేమో..?

కరెంట్‌ చార్జీలను మూడు నెలల పాటు రద్దు చేయాలని ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కొత్త డిమాండ్‌ను ప్రారంభించారు. బాబు చేసిన డిమాండ్‌ చేసిన విషయం అటుంచితే.. రద్దు అనే మాట ఆయన నోట నుంచి రావడంతో చరిత్రను గుర్తు చేశారు. రద్దు అనే మాటకు, చంద్రబాబుకు అవినాభావ సంబంధం ఉంది. ఆ రద్దు అనే మాట వల్ల చంద్రబాబు లాభ పడినా అంతకు మించి ప్రజలను కోలుకోలేని విధంగా నష్టపరిచారు.
.
2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 650 హామీల్లో ముఖ్యమైనవి రైతు రుణమాఫీ, డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ. భేషరుతుగా ఈ రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు పలు బహిరంగ సభల్లో హామీ ఇచ్చారు. ఈ మేరకు తన పార్టీ ఎన్నికల మెనిఫెస్టోలో కూడా పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతు, డ్వాక్రా రుణాల మాఫీపై ప్రత్యేకమైన వీడియో ప్రకటనలు తయారు చేయించి విరివిగా ప్రచారం చేశారు. మొత్తం మీద 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇక తన హామీలను అమలు చేసే సమయం ఆసన్నమైంది.

భేషరతుగా రైతు రుణాలు, వ్యవసాయంపై తెచ్చుకున్న బంగారు రుణాలు మాఫీ చేస్తానన్న బాబు ఆదిలోనే మాట తప్పారు. బంగారు రుణాల మాఫీని కొండెక్కించారు. ఇక పంట రుణాలపై కమిటీ వేసి సీలింగ్‌ విధించారు. 1.50 లక్షల వరకూ మాత్రమే మాఫీ చేస్తామన్నారు. అదీ కూడా ఐదు దఫాల్లో చేస్తామన్నారు. మూడు దఫాలు ఇచ్చిన నగదు రైతు రుణాల వడ్డీకి కూడా సరిపోలేదు. అప్పటి వరకూ ప్రతి ఏడాది రుణాలు తెచ్చుకుని పంట అమ్మకం తర్వాత చెల్లించే రైతులు బ్యాంకుల వైపు వెళ్లేందుకు సాహసం చేయలేదు. బ్యాంకులు కూడా రైతులను అవహేళనగా చూడడం ప్రారంభించారు. నోటీసులతో రైతులు తీవ్ర మానసిక వేదన అనుభవించారు. చివరికి ఐదు దఫాలలో రెండు దఫాలు చేయనేలేదు. ఓడిపోయిన తర్వాత వైసీపీ సర్కార్‌ తాను ఇచ్చిన ఆ హామీలోని రెండు దఫాలు చేయాలనే డిమాండ్‌ వినిపించి తనకున్న 40 ఏళ్ల అనుభవ సామర్థ్యం ఏమిటో చాటిచెప్పారు.

ఇక డ్వాక్రా రుణాల సంగతి మరో కథ. దాదాపు 14 వేల కోట్ల రూపాయల డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా.. ఆ పని చేయలేదు. ఎన్నికల ముందు మీరెవరూ కట్టవద్దూ.. నేనొచ్చాక మాఫీ చేస్తాన్న చంద్రబాబు మాట నమ్మని మహిళలు వాయిదాలు కట్టడం మానేశారు. చివరికి బాబు తమను నట్టేట ముంచాడని తెలుసుకున్న డ్వాక్రా మహిళలు అపరాధ వడ్డీతో సహా రుణాలు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు నోటీసులు ఇచ్చి మరీ బకాయిలను వసూలు చేశాయి.

బాబు గత చరిత్ర ఇలా సాగింది. అందుకే తాజాగా ఆయన కరెంట్‌ చార్జీలు మూడు నెలలు రద్దు చేయాలనగానే ఆయన ఇచ్చిన రైతు, డ్వాక్రా రుణాల రద్దు, అమలు విషయం అందరికీ గుర్తుకు వచ్చింది. తమను తన దొంగ హామీలతో తీవ్రంగా నష్టపరిచిన బాబు నోట మళ్లీ రద్దు అనే మాట ప్రజల వద్దకు వెళ్లి చెబితే కొట్టనైనా కొడతారేమో. ప్రజలను ఆ స్థాయిలో చంద్రబాబు మోసం చేశారు మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి