iDreamPost

డిజిటల్ కే జై కొట్టిన మల్టీ స్టారర్

డిజిటల్ కే జై కొట్టిన మల్టీ స్టారర్

ఇంకో నెల రోజుల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయన్న ఆనందంతో ధారాళంగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్న బాలీవుడ్ నిర్మాతలు ఇకపై ఓటిటి తాకిడి ఉండదనుకుంటున్నారేమో. కానీ అలాంటిదేమి లేదని అర్థమవుతోంది. జనాలు సినిమా హాళ్లకు రావడం పట్ల అనుమానాలు ఉన్న ప్రొడ్యూసర్లు ఓటిటికే మొగ్గు చూపుతున్నారు. అక్షయ్ కుమార్ ధనుష్ నటించిన అత్ రంగీరే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ఇళ్లకే రాబోతోందని లేటెస్ట్ అప్ డేట్. ఇందులో సైఫ్ అలీ ఖాన్ తనయ సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటించింది. ఆల్రెడీ డీల్ అయిపోయిందని డేట్ త్వరలోనే ప్రకటించబోతున్నారనేది ముంబై న్యూస్. డీల్ ఎంత అనేది బయటికి రాలేదు

ఈ అత్ రంగీరేకు దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్. 2018లో షారుఖ్ ఖాన్ కు జీరో రూపంలో డిజాస్టర్ ఇచ్చింది తనే. అంతకు ముందు తను వెడ్స్ మను రెండు భాగాలు, రంఝాన, తోడి లైఫ్ తోడి మేజిక్ లాంటి హిట్లు, విలక్షణ చిత్రాలు ఈయన ఖాతాలో ఉన్నాయి. నిజానికి ఈ సినిమా గత ఏడాదే పూర్తయ్యింది. ఆగస్ట్ లో రిలీజ్ చేద్దామని కూడా ప్లాన్ చేశారు. కానీ కుదరలేదు. మరోవైపు దీనికన్నా ఆలస్యంగా మొదలైన అక్షయ్ వేరే సినిమాలు రక్షా బంధన్, రామ్ సేతు, బచ్చన్ పాండే లాంటివి విడుదల లాక్ చేసుకోవడంతో అత్ రంగీరేకు ఇంతకు మించిన ఆప్షన్ లేకపోయినట్టు ఉంది. సౌత్ లోనూ దీనికి మంచి క్రేజ్ ఉంది.

ధనుష్ ఉండటంతో తమిళ తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్పందన వస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు. ఇతను హిందీ సినిమాలు చేయడం కొత్తేమి కాదు కానీ ఇప్పుడీ కాంబో క్రేజీగా ఉండటం ఆసక్తి రేపుతోంది. ఇది కాసేపు పక్కనపెడితే ఇప్పుడు థియేటర్ల కోసం చెప్పుకున్న డేట్లకు ఆయా నిర్మాతలు కట్టుబడి ఉంటారన్న గ్యారెంటీ ఎంతమాత్రం లేదు. కరోనా దెబ్బకు పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ ఎన్ని వాయిదాలు వేసుకున్నాయో తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్ రంగీరే లాంటివి ఓటిటి బాట పట్టడం సేఫ్ అనే చెప్పాలి. పైగా అధిక శాతం ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశం పెరుగుతుంది

Also Read : సంగీత దర్శకుడి సుడి మాములుగా లేదు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి