iDreamPost

ఎట్టకేలకు చైనా నుండి క్షేమంగా ఇంటికి..

ఎట్టకేలకు చైనా నుండి క్షేమంగా ఇంటికి..

గత కొన్నివారాలుగా చైనాలోని వుహాన్‌ పట్టణంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు ఎట్టకేలకు సొంతూళ్లకు చేరుకున్నారు. మనరాష్ట్రం నుండి కొంత మంది తెలుగు విద్యార్థులు జనవరి 23న చైనాలోని వుహాన్‌ నగరంలో పీవో టీపీఎల్‌ ట్రైనింగ్‌కు వెళ్లారు. కోవిడ్ -19 (కరోనా వైరస్) ఎక్కువగా ప్రభలిన హుబే ప్రావిన్స్ పరిధిలోనే ఈ వుహాన్ నగరం ఉంది. కోవిడ్‌ -19 (కరోనా వైరస్‌) వ్యాప్తితో అల్లాడుతున్న వుహాన్ నగరానికి శిక్షణ కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడ ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆ వెంటనే విదేశీ దౌత్యపరమైన చర్యలు చేపట్టింది.

ఈ నేపధ్యంలో ఈ నెల 3 న చైనా నుంచి ప్రత్యేక విమానంలో 58 మంది విద్యార్థులను వుహాన్ నుండి ఢిల్లీకి తీసుకొచ్చారు. వారిని అక్కడ 14 రోజుల పాటు వైద్యుల అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఎట్టకేలకు వారికి కరోనా లక్షణాలు లేవని నిర్ధారణ కావడంతో వాళ్ళని వారివారి సొంతూళ్లకు పంపించే ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు విశాఖకు చెందిన 9 మంది పీవో టీపీఎల్‌ ట్రైనీ విద్యార్థులు మంగళవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

తమ పిల్లల ఆరోగ్యం పట్ల ఇన్నాళ్లూ ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు తమ బిడ్డలు సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఇన్నాళ్లు ఢిల్లీలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులలో బిక్కుబిక్కుమంటూ గడిపి ఎట్టకేలకు సొంత ఇళ్లకు చేరుకోవడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సర్వెలెన్స్‌ ఆఫీసర్‌ పార్థసారథి మాట్లాడుతూ విద్యార్థులను 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలించామని, వారికి ఎటువంటి కరోనా వైరస్‌ లక్షణాలు లేవని తెలిపారు. అయితే మరో 14 రోజుల పాటు విద్యార్థుల ఇంటికి వెళ్లి ఎప్పటికప్పుడు వారి పరిస్థితులు తెలుసుకుంటామని ఆయన తెలిపారు.

ఇటీవల చైనాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న విశాఖపట్నానికి చెందిన ఓ యువతి (21) చైనా నుంచి బ్యాంకాక్‌ మీదుగా విశాఖ చేరుకున్నారు. ఈ క్రమంలో ఆమె విదేశాల్లోని పలు విమానాశ్రాయాల సమీపంలో భోజనాలు చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ చేరుకోగానే ఆమె వాంతులు, విరోచనాలతో బాధపడుతుండడంతో ఆమెను చినవాల్తేరులోని ప్రభుత్వ అంటువ్యాధుల ఆస్పత్రిలో చేర్చారు. జలుబు లక్షణాలు కనిపించడం, చైనా నుంచి రావడంతో ఆ యువతిని ముందుజాగ్రత్త చర్యగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక వార్డులో చేర్చారు.

ప్రత్యేక కరోనా ఐసోలేటెడ్ వార్డులో పరీక్షలు చేయగా ఆరోగ్యం నిలకడగానే ఉందని తేలింది. మరికొన్ని శాంపిళ్లను హైదరాబాద్‌ ప్రయోగశాలకు పంపించారు. ఈ సందర్భంగా జిల్లా కరోనా వైరస్‌ నివారణ నోడల్‌ అధికారి డాక్టర్‌ పార్థసారథి మాట్లాడుతూ ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగానే వుందన్నారు. చైనా నుంచి రావడం వల్లనే ముందుజాగ్రత్తగా కరోనా వార్డులో చికిత్స చేయించామన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా బుధవారం డిశ్చార్చిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఆమె ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో విశాఖకు చెందిన 23 ఏళ్ల మరో యువతి చైనాలోని యుహన నగరం నుంచి మంగళవారం విశాఖ వచ్చారు. ఆమెకు జ్వరం రావడంతో పెదవాల్తేరు ప్రభుత్వఛాతి ఆస్పత్రిలో చేర్పించారు. శాంపిల్స్‌ హైదరాబాద్‌ పంపారు. ప్రస్తుతం యువతి బాగానే వుందని వైద్యులు తెలిపారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి