iDreamPost

బాలయ్య వారసుడిని పరిచయం చేస్తున్నారా

బాలయ్య వారసుడిని పరిచయం చేస్తున్నారా

నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. అదిగో ఇదిగో అంటూ బాలయ్య ఊరిస్తూ వస్తున్నారు తప్ప ఫలానా టైంలో ఫలానా దర్శకుడితో తీయబోతున్నామని ఎక్కడా చెప్పలేదు. ఆ మధ్య ఆదిత్య 369 సీక్వెల్ ద్వారా తన డైరెక్షన్ లోనే పరిచయం చేస్తానని అన్నారు కానీ అది అంత త్వరగా జరిగే పనిలా కనిపించడం లేదు. అయితే నిన్న జరిగిన పరిణామాలు ఇప్పుడు పరిశ్రమలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఎన్నడూ లేనిది మోక్షజ్ఞ స్వయంగా అభిమానులను కలుసుకుని తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇంతే కాదు చాలా కేంద్రాల్లో భారీ ఎత్తున కేక్ కటింగులు, అన్నదాన శిబిరాలు నిర్వహించారు. వాటి తాలూకు ఫోటోలను ఫేస్ బుక్, ట్విట్టర్లలో షేర్ చేసుకున్నారు. డిపిలు తయారు చేయించి వైరల్ చేశారు. అంతేనా కొందరు సెలెబ్రిటీలతో విషెస్ కూడా చెప్పించారు. మోక్షజ్ఞ లుక్ పరంగా మరీ కొత్తగా ఏమి కనిపించడం లేదు కానీ కాస్త ఒళ్ళు తగ్గించి తగినంత శిక్షణ తీసుకుంటే పనికొచ్చే మెటీరియల్ లా ఉన్నాడన్న అభిప్రాయం మాత్రం జనంలో వ్యక్తమయ్యింది. ఎప్పుడూ ఫోటోల ముందుకు రాని మోక్షజ్ఞ ఇప్పుడు అదే పనిగా స్టిల్స్ ఇవ్వడం చూస్తుంటే సినీ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది.

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి తర్వాతి రెండు తరాల్లో ఇద్దరు మాత్రమే స్టార్లు అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణకు వారసుడు కాబట్టి బాలయ్య నుంచి మోక్షజ్ఞని వీలైనంత త్వరగా లాంచ్ చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ చేస్తున్నారు. ఒకపక్క మెగా హీరోలు పదికి పైగా ఇండస్ట్రీలో ఉంటే తమ సంఖ్య మాత్రం రెండుకే పరిమితం కావడం పట్ల వాళ్ళ అసంతృప్తి ఎప్పటి నుంచో ఉన్నదే. మరి లేట్ అయినా పర్లేదు ఆదిత్య 999తోనే మోక్షజ్ఞను దించుతారా లేక ఏదైనా మంచి కాంబినేషన్ సెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారా అనేది వేచి చూడాలి. అప్పుడెప్పుడో సాయి కొర్రపాటి ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి డ్రాప్ కావడం గుర్తే

Also Read : విలక్షణ నటుడి అభిమానులకు విందే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి