iDreamPost

ప్రక్షాళనకు వేళాయే

ప్రక్షాళనకు వేళాయే

అన్ని లోపాలను సవరించి, పూర్తి పారదర్శకంగా పనిచేసేలా ఏపీపీఎస్సీని తీర్చిదిద్దాలని జగన్ సర్కార్ సంకల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం), నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) వంటి సంస్థల సహకారంతో సమూల సంస్కరణల దిశగా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అడుగులు వేస్తోంది. కమిషన్‌ బుధవారం సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్‌ జింకా రంగ జనార్దన, సభ్యులు కె.విజయకుమార్, ప్రొఫెసర్‌ గుర్రం సుజాత, ప్రొఫెసర్‌ కె.పద్మరాజు, సేవారూప, ఎంవీ రామరాజు, జీవీ సుధాకర్‌రెడ్డి, ఎస్‌.సలాంబాబు, కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు, ప్రభుత్వ ఐటీ సలహాదారు లోకేశ్వరరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఏపీపీఎస్సీలో అమలు చేయనున్న సంస్కరణలు

– ప్రశ్నలు, సమాధానాలు, ‘కీ’లలో పొరపాట్లకు తావులేకుండా వాటి రూపకల్పన సమయంలోనే నిపుణులతో పునఃసమీక్ష. తప్పులను ముందుగానే సవరించడం లేదా తొలగించడం.

– తెలుగు అనువాదంలో తప్పులు దొర్లకుండా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ, యూపీఎస్సీ, కేట్‌ వంటి సంస్థల సహకారం.

– గ్రూప్‌–1 పరీక్షలో డిజిటల్‌ మూల్యాంకనం అమలు.

– మెయిన్స్‌ పరీక్షలో అభ్యర్థులకు ప్రశ్నపత్రాలను ట్యాబ్‌ల ద్వారా అందిస్తారు. ముందుగా అందించే పాస్‌వర్డ్‌తో పరీక్ష సమయానికి ఈ ట్యాబ్‌ తెరుచుకుని అభ్యర్థికి ప్రశ్నపత్రం దర్శనమిస్తుంది. సమాధానాలను బుక్‌లెట్‌లో రాయాలి.

– ఆ సమాధానాలను స్కాన్‌ చేయించి, కంప్యూటర్లలో నిక్షిప్తం.

– ఆయా ప్రశ్నలకు సమాధానాల్లో ఏయే పాయింట్లుండాలి? వాటికి ఎన్ని మార్కులు వేయాలి? అన్నది ముందుగానే నిపుణులతో నిర్ధారణ.

– సమాధాన పత్రాలను తొలుత ఇద్దరు సబ్జెక్టు నిపుణులు ఒకేసారి మూల్యాంకనం చేస్తారు. వారిచ్చే మార్కుల మధ్య వ్యత్యాసం 50 శాతం, అంతకు మించి ఉంటే మూడో నిపుణుడుతో మూల్యాంకనం.

– ఆయా సమాధానాలకు వేసే మార్కులను ఏ కారణంతో అన్ని వేయాల్సి వచ్చిందో మూల్యాంకనం చేసిన నిపుణుడు తెలియజేయాల్సి ఉంటుంది.

– పరీక్షలు ప్రారంభమైన రెండో రోజు నుంచే మూల్యాంకనం చేపడతారు. గడువులోగా ఫలితాలు విడుదల.

– మార్కుల తారుమారుకు అవకాశం లేకండా మూల్యాంకన సమయంలోనే అభ్యర్థులు సాధించిన మార్కులను ఆన్‌లైన్‌లో
నమోదు.

– ప్రిలిమ్స్‌లోనూ ప్రశ్నలు, సమాధానాలను జంబ్లింగ్‌ చేసి, మాల్‌ప్రాక్టీసుకు అడ్డుకట్ట.

– సిలబస్‌కు అనుగుణంగానే ప్రశ్నలుండేలా జాగ్రత్తలు. అభ్యర్థులకు వేర్వేరుగా ప్రశ్నలు.

– ఎక్కడా లీకేజీకి ఆస్కారం లేకుండా అప్రమత్తం.

– గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్ల స్థానంలో ఒకే పేపర్‌ ఉంటే మంచిదని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ప్రస్తుతం పేపర్‌–1 జనరల్‌ స్టడీస్, పేపర్‌–2 జనరల్‌ ఆప్టిట్యూడ్‌ 120 మార్కుల చొప్పున నిర్వహిస్తున్నారు. జనరల్‌ ఆప్టిట్యూడ్‌లోని కొన్ని యూనిట్లను తీసుకొని ఒకే పేపర్‌గా చేయాలని యోచిస్తున్నారు. మ్యాథ్స్, ఆర్ట్స్‌ అభ్యర్థులకు సమన్యాయం జరిగేలా చర్యలు చేపడతారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి