iDreamPost

మొదలైన కౌటింగ్‌.. గుండెపోటుతో అభ్యర్థి మృతి..

మొదలైన కౌటింగ్‌.. గుండెపోటుతో అభ్యర్థి మృతి..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల ఓట్లు లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు అన్ని లెక్కింపు కేంద్రాలలోనూ కౌటింగ్‌ మొదలైంది. బ్యాలెట్లను గుర్తులు వారీగా వేరు చేసి, 25 చొప్పన కట్టలు కడుతున్నారు. ఒక డివిజన్‌ / వార్డులోని అన్ని బూత్‌లలో పోలైన ఓట్లను వేరు చేసిన తర్వాత.. లెక్కింపు చేపడతారు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి..? ఎవరు ఎన్ని ఓట్లతో గెలిచారు..? చెల్లనివి ఎన్ని..? నోటాకే ఎన్ని వచ్చాయి..? వంటి వివరాలను వెల్లడించనున్నారు.

12 నగరపాలక సంస్థలు, 75 మున్సిపల్, నగర పంచాయతీలకు నోటిఫికేషన్‌ రాగా.. నాలుగు మున్సిపాలిటీలలో అన్ని వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 12 కార్పొరేషన్లు, 71 మున్సిపల్, నగర పంచాయతీలకు ఈ నెల 10వ తేదీన పోలింగ్‌ జరిగింది.

ఓట్ల లెక్కింపునకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రాత్రి 8 గంటల లోపు అన్ని ఫలితాలు వెల్లడయ్యేలా కౌటింగ్‌ చేపట్టాలని పేర్కొంది. కౌంటింగ్‌ కేంద్రాల్లో నిరంతరం విద్యుత్‌ ఉండాలని స్పష్టం చేసింది. ఇందు కోసం జనరేటర్లు, ఇన్వెర్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. వెబ్‌ కాస్టింగ్, వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ద్వారా కౌటింగ్‌ ప్రక్రియను చిత్రీకరించాలని ఆదేశించింది. సదరు ఫుటేజీని భద్రపరచాలని పేర్కొంది. పది కంటే తక్కువ మెజారిటీ వచ్చిన చోటనే రీ కౌంటింగ్‌కు అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పష్టం చేశారు.

ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గెలుపుకోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డారు. ఫలితం ఎలా వస్తుందోనన్న ఆందోళలన గెలుపుపై ఆశలు పెట్టుకున్న అభ్యర్థుల్లో నెలకొంది. ఈ క్రమంలో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కొద్దిసేపటి క్రితం విశాఖ నగరపాలక సంస్థ 11వ డివిజన్‌ నుంచి జనసేన తరఫున పోటీ చేసిన బోను భారతి (55) గుండెపోటుతో మృతి చెందారు.

Also Read : నేడు పుర ఫలితాలు.. అందరిలోనూ ఉత్కంఠ..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి