idream media
idream media
జగన్ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. తన వ్యూహాలకు అనుగుణంగా నిర్ణయాలు అమలులోకి తెస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వేటు వేసిన ప్రభుత్వం ఆ వెంటనే కొత్త ఎస్ఈసీని నియమించింది. ప్రస్తుతం తుడా సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి రామసుందర్ రెడ్డిని నియమించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఢీకొట్టి రాజకీయంగా కలకలం రేపిన నిమ్మగడ్డకు ఉద్వాసన తప్పలేదు. గవర్నర్ ఆమోదంతో సిద్ధం అయిన ఆర్డినెన్స్ తో ఎస్ఈసీ పదవీకాలం తగ్గించారు. అందులో భాగంగా ఐదేళ్ల కాల పరిమితిని మూడు సంవత్సరాలకు కుదించారు. దాంతో 2016 జనవరి 30న బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డకు నాలుగేళ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఆయన స్థానంలో తాజాగా రామసుందర్ రెడ్డిని నియమించడంతో న్యాయపరమైన సమస్యలను అధిగమించే వ్యూహంలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. గ్రూప్ 1 అధికారిగా కేరీర్ ను ప్రారంభించిన రామచంద్రారెడ్డి 2009 లో IASగా పదోన్నతి పొందారు. మొన్నటి జనవరిలో తుడా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
సీనియర్ అధికారిగా రామసుందర్ రెడ్డికి గుర్తింపు ఉంది. సామరస్యంగా ఉంటూ సమర్థవంతుడైన అధికారిగా గుర్తింపు పొందారు. వేగంగా పావులు కదుపుతూ కొత్త అధికారిని తెరమీదకు తీసుకురావడంతో ఇప్పుడీ అంశం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా చెప్పవచ్చు.