iDreamPost

పవన్‌ వామనుడు కాదు.. శల్యుడు, .శిఖండిలాంటి వాడు: పేర్ని నాని

  • Published Feb 29, 2024 | 3:01 PMUpdated Feb 29, 2024 | 3:01 PM

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మీద విరుచుకు పడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్‌ను శల్యుడు, .శిఖండిలతో పోల్చాడు. ఆ వివరాలు..

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ మీద విరుచుకు పడ్డారు మాజీ మంత్రి పేర్ని నాని. పవన్‌ను శల్యుడు, .శిఖండిలతో పోల్చాడు. ఆ వివరాలు..

  • Published Feb 29, 2024 | 3:01 PMUpdated Feb 29, 2024 | 3:01 PM
పవన్‌ వామనుడు కాదు.. శల్యుడు, .శిఖండిలాంటి వాడు: పేర్ని నాని

రానున్న ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం నాడు ఇరు పార్టీలు కలిసి తాడేపల్లిగూడెంలో జెండా పేరిట సభ నిర్వహించాయి. సుమారు ఆరు లక్షల మంది జనాలు సభకు తరలి వస్తారంటూ ఇరు పార్టీల నేతలు గొప్పలకు పోయారు. తీరా చూస్తే కనీసం 30 వేల మంది కూడా హాజరు కాలేదు. ఎక్కడికక్కడ ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చి.. కూటమిపై ప్రజలకు నమ్మకం ఏ స్థాయిలో ఉంది తేల్చి చెప్పారు. ఇక సభలో పవన్‌ ఎప్పటిలానే ఆవేశంతో ఊగిపోతూ పెద్ద పెద్ద పదాలు వాడుతూ ప్రసంగించాడు. ఈ క్రమంలోనే తనను, తన పార్టీని వామనుడితో పోల్చుకున్నాడు పవన్‌. అతడి వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇస్తూ.. మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి, శికండి పాత్రలు మాత్రమే సరిపోతాయంటూ ఎద్దేవా చేశారు. ఆ వివరాలు..

మాజీ మంత్రి పేర్ని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన సభలో కేవలం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నామస్మరణే చేశారు.. తప్పితే ఎన్నికల్లో వారికి ఎందుకు ఓటు వేయాలో చెప్పలేకపోయారంటూ ఎద్దేవా చేశారు. ‘‘ప్రజల క్షేమం, రాష్ట్ర క్షేమం చంద్రబాబు, పవన్‌ ఇద్దరికి పట్టదు. జెండా సభలో ఈ ఇద్దరు నేతలు కాపుల ఆత్మగౌరవాన్ని పెంచే ఒక్క మాట కూడా చెప్పలేదు. పవన్‌ సినిమా డైలాగ్‌లు బట్టీ కొట్టి.. వాళ్లు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ఉన్నది ఉన్నట్లు చదివాడు. గతంలో ఇదే పవన్‌ మాట్లాడుతూ.. అమరావతి.. ఒక కులానికే రాజధాని అన్నాడు. కానీ ఇప్పుడు దానిపై మాట మార్చాడు. అమరావతి కొందరి రాజధానే అన్న పవన్‌ ఈ రోజు ఎందుకు మాట మార్చారో చెప్పాలి’’ అంటూ పేర్ని నాని డిమాండ్‌  చేశారు.

‘‘ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర బేరాలు ఉండవమ్మా.. పవన్‌ నీకు చేతనైంది చేసుకోవచ్చు. నువ్వు 24 కాకపోతే.. నాలుగు, రెండే సీట్లు తీసుకో. నువ్వు ఎన్ని సీట్లు తీసుకున్నా వైఎస్సార్‌సీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. 2014, 2019 ఎన్నికల్లో కూడా పవన్‌.. జగన్‌కు వ్యతిరేకంగా పనిచేశాడు. ఇప్పుడు మూడో జెండా కోసం ఎదురుచూస్తున్నాడు. పవన్‌ చేష్టలు చూసిన కాపులు ఆయనకు ఓటు వేయడానికి ఆలోచిస్తున్నారు. పవన్‌కు చేతనైతే సీఎం జగన్‌పై చేసిన ఆరోపణలు నిరూపించుకోవాలి. సీఎం జగన్‌ గురించి టన్నుల టన్నుల సమాచారం ఉందంటున్న పవన్‌ ఎందుకు దాన్ని బయటపెట్టలేకపోతున్నారు’’ అని  పేర్ని నాని ప్రశ్నించారు.

పవన్‌ ఓ .శిఖండి..

‘‘పవన్‌ తన గురించి తానే చెప్పుకునే దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. పురాణాల్లో పవన్‌ను పోల్చాలంటే శల్యుడి పాత్ర ఒక్కటే ఉంది. పవన్‌ వామనుడు కాదు శల్యుడు, శికండిలాంటివాడు. పవన్‌ శల్యుడిలా మారి తన పార్టీని, పార్టీ నేతల్ని.. అందరినీ నిర్వీర్యం చేస్తున్నారు. జెండా సభలో చంద్రబాబు.. పవన్‌ గురించి ఒక్క మాట పాజిటివ్‌గా చెప్పలేదు. ప్రజా జీవితంలో ఇచ్చిన మాట తప్పితే ప్రజలు ప్రశ్నిస్తారు. 2024లో చంద్రబాబు, పవన్‌ జెండాలను ప్రజలు మడతేస్తారు. చంద్రబాబు కోసం నాలుక మడతేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.

‘‘చంద్రబాబు పల్లకీ మోయడమే పవన్‌ పని. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం ఎంత కష్టమో.. పవన్‌ను నమ్ముకుని రాజకీయం చేయడం కూడా అంతే. ప్రశ్నిస్తానన్న పవన్‌.. చంద్రబాబును ఇప్పటి వరకు ఒక్కసారైనా ప్రశ్నించారా. పవన్‌ ఎన్ని సీట్లు తీసుకున్నా.. దానిపై సమాధానం చెప్పుకోవాల్సింది ఆయన అభిమానులకు, కార్యకర్తలకు మాత్రమే.. మాకు, వైఎస్సార్‌సీపీకి కాదని’’ పేర్ని నాని స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి