iDreamPost

నాపై దాడి చేసిన వారంతా టీడీపీ ఫెయిడ్‌ అర్టిస్టులే

నాపై దాడి చేసిన వారంతా టీడీపీ ఫెయిడ్‌ అర్టిస్టులే

అమరావతి ప్రాంతంలో దళిత ఎంపీలు తిరగొద్దా?
జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ నాపై దాడి చేశారు
మహిళలను అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు నాపై దాడి చేశారు
మహిళల ముసుగులో ఉన్న టీడీపీ వర్గీయులు బూతులు తిట్టారు
ఎంత కాలం పచ్చ మీడియా అబద్ధాలు రాస్తారు?
ఉప్పు,కారం తింటున్న మాకు రోషం ఉండదా? – ఎంపీ నందిగాం సురేష్‌

తనపై లేమల్లే గ్రామంలో దాడి చేసిన వారంతా కూడా టీడీపీ ఫెయిడ్‌ ఆర్టిస్టులేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ దళిత ఎంపీ నందిగం సురేష్‌ పేర్కొన్నారు. దళిత ఎంపీ రాజధాని ప్రాంతంలో తిరుగకూడదా? ఇదంతా కూడా చంద్రబాబు రక్త చరిత్ర అని వ్యాఖ్యానించారు. మహిళలను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నందిగం సురేష్‌ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

గుంటూరు జిల్లా అమరావతి మండలం లేమల్లె గ్రామంలో ఆదివారం అమరావతి అమరలింగేశ్వరస్వామి రథోత్సవం కార్యక్రమంలో పాల్గొని కార్ల వద్దకు నడుచుకుంటూ వస్తుండగా జై అమరావతి, జై సీబీఎన్‌ అంటూ నినాదాలు చేసుకుంటూ నా వెంట పడ్డారు. నా వెంట లేళ్ల అప్పిరెడ్డి కూడా ఉన్నారు. వెనుక్కి చూడకుండా ముందుకు వెళ్తున్నాను. నేను వాళ్లను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే నా వద్దకు వచ్చి చెవిలో జై అమరావతి అంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. ఎదురు తిరిగే పరిస్థితి లేదు కాబట్టి అప్పిరెడ్డి చెప్పినట్లుగా మౌనంగానే ముందుకు వెళ్తున్నాను. అప్పిరెడ్డి కారు ఎక్కి వెళ్తుంటే ఆ కారుపై దాడి చేశారు. లేమల్ల వైపు వెళ్తుండగా కారు మారేందుకు ఆగాం. ఒక బస్సు వచ్చింది. కారుకు ఎదురుగా బస్సును ఆపి అందులో నుంచి మహిళలు దిగారు. వారంతా జై అమరావతి, జై సీబీఎన్‌ అంటూ నినాదాలు చేశారు. వారంతా జేఏసీ అని చెబుతున్నా..వాళ్లంతా కూడా టీడీపీకి చెందిన వారే.

ఓ మహిళా వచ్చి ..అరే నీవు ఒక ఎంపీవా? ఏంట్రా..ఏమీ చేస్తార్రా….అంటూ దుర్భషలాడింది. అక్కడికి నేను సహనంతో అమ్మా..నీవు ఆడపిల్లవు..వదిలేయండి..నేను వెళ్తాను అంటూ కారు డోర్‌ తీసే ప్రయత్నంలో అటువైపు నుంచి మరో కొందరు మహిళలు చేతుల్లో కారం పొడి తీసుకొచ్చి చల్లారు. నా వెంట ఉన్న గన్‌మెన్లు అప్రమత్తమై..కళ్లు మూసి నన్ను కారులోకి ఎక్కించారు. నా వద్ద పీఏగా పని చేస్తున్న లక్ష్మన్నను కాలర్‌ పట్టుకొని కొట్టారు. వాళ్ల అన్నపై చెప్పుతో దాడి చేశారు. ఇవన్నీ కూడా వీడియోలో ఉన్నాయి. ఆ ప్రాంతంలో అందరూ తిరుగుతున్నారు. నన్ను మాత్రమే టార్గెట్‌ చేశారు. ఏం ఖర్మ పట్టింది. కంట్లో కారం చల్లాల్సిన పనేముంది. టీవీ 5, ఏబీఎన్‌, ఈనాడుకు ఒక్కటే చెబుతున్నాను. నిజం మాట్లాడండి. మీరు అబద్ధాలు చెప్పబట్టే కదా చంద్రబాబుకు 23 సీట్లు వచ్చాయి. లేనిపోనివన్నీ కల్పించి అమరావతి ప్రజలను కూడా అలాంటి పరిస్థితికి తీసుకెళ్లే విధంగా ఉన్నారు. వాళ్లు అమరావతి ప్రజలు కాదు..వారికి అమరావతితో సంబంధమే లేదు. నిన్న తుళ్లూరు ప్రాంతంలో తిరిగాను. ఒక్క రైతు కూడా ఏమీ అనలేదు. మాకు ఏమైన ప్రయోజనం కలిగేలా చూడమని టీడీపీ నేతలే కోరారు. నిన్న దాడి చేసిన వారంతా కూడా టీడీపీ ఫెయిడ్‌ ఆర్టీస్టులే. ఎక్కడెక్కడి వారినో తీసుకొచ్చి నాపై దాడి చేశారు. నా పక్కన ఉన్న కోటి అనే పిల్లాడిని కాలర్‌ పట్టుకొని కిందకు లాగారు. ఆ బస్సులో చాలా మంది మగాళ్లు ఉన్నారు. మా ఊరికి చెందిన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తున్నానో టీడీపీకి సమాచారం ఇస్తున్నారు. సామాన్యుడికి గౌరవం ఇవ్వాల్సిన పని లేకున్నా..ఒక ఎంపీకైనా గౌరవం ఇవ్వాలి కదా?

చంద్రబాబు ఒక దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. దానికి మీరు సపోర్టు చేస్తారు. చంద్రబాబుకు చేసే తప్పులకు కొమ్ము కాసే మీడియా సోదరులకు ఒక్కటే చెబుతున్నాను. సాక్ష్యాధారాలతో వార్తలు రాయండి, మనసాక్షి లేకుండా ఎలా వార్తలు రాస్తారు. ఆలపాటి రాజా, గల్లా జయదేవ్‌ అక్కడ ఎలా ప్రత్యక్షమయ్యారు. వీళ్లు కూడా ఆ బస్సులో ఉన్నారా? మాపై పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేస్తున్నారు. చంద్రబాబు దద్దమ్మ రాజకీయాలు మానుకోవాలి. ఒక మగాడిగా రాజకీయాలు చేయాలి. ఆడవాళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తే..మేం కూడా అలాగే చేయగలం. మాకు చేతకాక కాదు. సీఎం వైయస్‌ జగన్‌ మాకు ఒక పదవి ఇచ్చి నీవు నిబద్ధతతో పని చేయాలని చెప్పారు. ప్రజల కోసం, పార్టీ కోసం పని చేయాలని చెప్పారు కాబట్టే..ఆయన మాటకు కట్టుబడి పని చేస్తున్నాం. ఉప్పు,కారం తింటున్న మాకు రోషం ఉండదా? రాజధాని చంద్రబాబు అబ్బ సొత్తా? ఆయన అక్రమాస్తులకు రాజధానిని అడ్డగా మార్చుకున్నారు. ఇక్కడే రాజధాని ఉండాలని పోరాటాలు చేస్తున్నావు. సిట్‌ విచారణ జరుగుతుంటే ఏదో విధంగా తప్పించుకోవాలని చూస్తున్నారు.

చంద్రబాబు దుర్మార్గుడు కాబట్టే చెప్పుతో కొట్టినా ఇంకా ఇలాంటి భౌతిక దాడులు చేయిస్తున్నాడు. రాజధాని ప్రాంతానికి అప్పట్లో వైయస్‌ జగన్‌ వస్తే పచ్చ నీళ్లు చల్లించారు. ఇప్పుడు దళిత ఎంపీ వస్తే దాడులు చేయిస్తున్నాడు. ఇంత నీచ సంస్కృతి ఏనాడైనా ఉందా? దళిత ఎంపీలు తిరుగకూడదని ఎక్కడైనా ఉందా? మేం మాత్రమే పాలన చేయాలనే కాన్సెప్ట్‌ పెట్టుకున్నారా? లింగాయపురం వద్ద టీడీపీ నేతలు మా వర్గీయులపై దాడులు చేసి బట్టలు చించేశారు. ఎన్నాళ్లు మీరు దౌర్జన్యాలు చేస్తారు. మహిళలను అడ్డుపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? రాత్రి 2 గంటలకు యూఎస్‌ నుంచి ఫోన్‌ చేసి నోటికి వచ్చినట్లు మాట్లాడారు. నీ అంతు చూస్తామని బెదిరించాడు. జగన్‌ వచ్చి కాపాడుతారా? అంటూ బెదిరించాడు. మాపైనే దాడులు చేస్తే..ఒక సామాన్యులకు ఏ సందేశం ఇవ్వాలి.

మేం మాత్రమే పాలించాలన్న నీచ సంస్కృతికి చంద్రబాబు తెర లేపారు. ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన సరైంది కాదు. కారం పొట్లాలు వాళ్లే మన కారులో వేశారని రాణి అనే మహిళ ఆందోళనకారులకు డైరెక్షన్‌ ఇచ్చింది? చిత్తు చిత్తుగా ఎంపీని కొట్టాలని ఆమె ఆర్డర్‌ చేసింది. ఆ వివరాలన్నీ వీడియోలో ఉన్నాయి. ఇది రాజధాని ప్రాంతంలో పరిస్థితి. ఇంకా కూడా అసత్య ప్రచారాలు ఎలా చేస్తారో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు తొత్తులుగా మారి ఎల్లోమీడియా అసత్య ప్రచారం చేయడం దారుణం. ఇకనైన చంద్రబాబు కుట్ర రాజకీయాలు మానుకోవాలని నందిగం సురేష్ వ్యాఖ్యానించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి