iDreamPost

80 రోజుల పోరాటాలతో అఖండ రచ్చ

80 రోజుల పోరాటాలతో అఖండ రచ్చ

నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న అఖండ షూటింగ్ నిన్నటితో పూర్తయ్యింది. భారీ యాక్షన్ ఎపిసోడ్ తో దర్శకుడు బోయపాటి శీను గుమ్మడి కాయ కొట్టేశారు. ఇక వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేయబోతున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అఖండలో పోరాట దృశ్యాలను 80 రోజులు చిత్రీకరించారట. ఒకరకంగా ఇది రికార్డు. రాజమౌళి తప్ప ఈ స్థాయిలో గతంలో ఫైట్ల కోసం ఇన్నేసి రోజులు షూట్ చేసిన వారు లేరు. అలాంటిది ఒక కమర్షియల్ మూవీకి ఇంత చేశారంటే బాలయ్య కెరీర్ లోనే హై వోల్టేజ్ యాక్షన్ ని ఇందులో బోయపాటి చూపించబోతున్నట్టు తెలిసింది. ఫైట్లు కూడా ఎక్కువే ఉంటాయట.

సింహా, లెజెండ్ తర్వాత రిపీట్ అవుతున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు మాములుగా లేవు, బాలకృష్ణకు సైతం ఇప్పుడో బ్లాక్ బస్టర్ అవసరం చాలా ఉంది. గత సినిమాలు తీవ్రంగా నిరాశపరచడమే కాక కనీస స్థాయిలో ఆడకపోవడం ఫ్యాన్స్ ని బాధించింది. బోయపాటి శీనుకి సైతం ఇది కీలకం. వినయ విధేయ రామకు వచ్చిన విమర్శలకు తిప్పి కొట్టాలంటే ఇదొక్కటే మార్గం. ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అఖండతో వాటిని బదులు చెప్పాలనే కృత నిశ్చయంతో ఉన్నారు శీను. దానికి తగ్గట్టే కంప్లీట్ ప్యాకేజ్ సిద్ధం చేశారని వినికిడి.

ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. ఫ్యాక్షనిస్ట్ గా అఘోరాగా గవర్నమెంట్ ఆఫీసర్ గా బాలయ్య వివిధ షేడ్స్ లో కనిపిస్తారని అంటున్నారు కానీ సినిమా వచ్చేదాకా దీనికి సంబంధించి క్లారిటీ రాదు. అఖండ విడుదల విషయంలోనూ త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నారు. పనులు వేగంగా పూర్తయితే సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. అక్టోబర్ లో మళ్ళీ ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలు ఉన్నాయి కాబట్టి ఆలోగా రన్ ని పూర్తి చేసుకోవచ్చు. సో బాలయ్య మాస్ విశ్వరూపం దగ్గరలోనే చూడొచ్చన్న మాట

Also Read : ఈ ఛాలెంజులు ఎందుకు పాగల్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి