iDreamPost

భారత్ లో తీవ్రస్థాయిలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

భారత్ లో తీవ్రస్థాయిలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు

ఒక్కరోజులో 10884 పాజిటివ్ కేసులు-261మరణాలు

కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 9వేలకు పైగా కేసులు, 200 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది.  కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 10,884 పాజిటివ్ కేసులు నిర్దారణ కాగా, 261 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,57,486 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య 7207 కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల్లో నిన్న నమోదయిన కేసులే అత్యధికం. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఆరవ స్థానంలో కొనసాగుతోంది.  కరోనా వైరస్ బారినుండి 1,23,848 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. 1,26,418 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో 3007 పాజిటివ్ కేసులు నిర్దారణ

మహారాష్ట్రలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడేలా లేదు. మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజులోనే 3007 పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయి. అత్యధిక పాజిటివ్ కేసులతో పాటుగా అత్యధిక మరణాలు కూడా మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటివరకు 85975 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్దారణ అయ్యాయి. కరోనా కారణంగా ఇప్పటివరకు మహారాష్ట్రలో 3060 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క ముంబయి నగరంలోనే కరోనా బాధితుల సంఖ్య 48,774 మంది ఉండటం అక్కడి తీవ్రతను తెలియజేస్తుంది. 1638 మంది ప్రాణాలు కోల్పోయారు.

తెలంగాణలో నిన్న కొత్తగా అత్యధికంగా 154 మందికి కరోనా నిర్దారణ అయ్యింది. తెలంగాణలో ఇప్పటివరకు 3650 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1771 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగా 1742 మంది కరోనా బారినుండి కోలుకున్నారు. 137 మంది మృత్యువాత పడ్డారు.నిన్న ఒక్కరోజే 14 మరణాలు సంభవించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 199 కొత్త  కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ లో 4659 మందికి కరోనా సోకగా 75 మంది మృత్యువాత పడ్డారు. 2669 మంది వ్యాధి నుండి కోలుకుని రికవర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,915యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా 7,086,465 మందికి కోవిడ్ 19 సోకగా 406,126 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 3,460,171 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 2,007,449 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 112,469 మంది మరణించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి