iDreamPost

చేతులు కలిపిన ఎంటర్ టైన్మెంట్ దిగ్గజాలు

చేతులు కలిపిన ఎంటర్ టైన్మెంట్ దిగ్గజాలు

కరోనా తర్వాత రేగిన డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ విప్లవం ఏకంగా కార్పొరేట్ సంస్థలను ఏకం అయ్యేలా చేస్తోంది. ఈ రంగంలో కనిపిస్తున్న ఉజ్వల భవిష్యత్తును అందుకునేందుకు పక్కా ప్రణాళికలతో సదరు కంపెనీలు సరికొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తున్నాయి. అందులోని భాగంగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా(SPNI), జీ ఎంటర్ టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్(ZEEL) సంస్థలు చేతులు కలిపి ఒకటి కాబోతున్నాయి. ఈ మేరకు ప్రకటన వచ్చేసింది. దీనికి గాను సోనీ సుమారు 1.57 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టబోతోంది. మెర్జ్ అయ్యాక సోనీకి 52.93 శాతంతో సింహభాగం దక్కబోతోంది. మిగిలిన 47.07 జీ చేతిలోనే ఉంటుంది

ఈ ఒప్పందంలో భాగంగా కంబైన్డ్ ఫర్మ్ కింద మొత్తం 75 టీవీ ఛానల్స్, రెండు ఓటిటి వీడియో స్ట్రీమింగ్ యాప్స్(సోనీ లివ్-జీ5), రెండు సినిమా స్టూడియోలు(జీ స్టూడియోస్-సోనీ పిక్చర్స్ ఫిలిమ్స్ ఇండియా), ఒక డిజిటల్ కంటెంట్ స్టూడియో(స్టూడియో నెక్స్ట్) ఇవన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. దీనివల్ల ఇప్పుడీ సంస్థ ఇండియాలోనే అతి పెద్ద ఎంటర్ టైన్మెంట్ నెట్వర్క్ గా అవతరిస్తుంది. స్టార్, డిస్నీ ఇండియాలకు కూడా ఇంత స్పాన్ లేదు. సో కామన్ లోగో ఎలా ఉండబోతోంది, పేరు ఏమైనా మారుస్తారా లాంటి వివరాలు త్వరలోనే తెలియబోతున్నాయి. ఇప్పటికైతే ఇది మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇదో సరికొత్త మార్పుకు శ్రీకారం అనుకోవాలి. థియేటర్లకు జనాల రాక తగ్గుతూ వస్తోంది. ఏదో యావరేజ్ సినిమానో కంటెంటో ఉంటే దానికి హాల్ దాకా ఎందుకు. కొద్దిరోజులు ఆగితే ఓటిటి లో వస్తుంది కదానే ధోరణి పెరుగుతోంది. దానికి తోడు గత ఏడాది కాలంలో వచ్చిన చాలా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ సినిమాల ప్రభావం వినియోగదారుల మీద పడింది. థియేటర్లు పోగొట్టుకున్న రెవిన్యూ అంతా ఓటిటి యాప్స్ చందాలుగా మారిపోయింది. మున్ముందు ఈ ప్రభావం ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అందుకే దీన్ని పసిగట్టిన సోనీ సంస్థ చాలా తెలివైన ఎత్తుగడతో జీతో దోస్తీ కట్టింది. మరి సబ్స్క్రైబర్స్ ని విడిగా చూస్తారా లేక కలిపేస్తారా చూడాలి మరి

Also Read : కోటీశ్వరులు’ను సీరియస్ గా తీసుకున్న ఎన్టీఆర్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి