iDreamPost

రేపు వైఎస్సార్‌ నేతన్న హస్తం ప్రారంభం

రేపు వైఎస్సార్‌ నేతన్న హస్తం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌జగన్‌ సర్కార్‌ మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. అప్పటికే రైతులు, ఆటోవాలాలు, మత్స్యకారులు, జూనియర్‌ న్యాయవాదుల సంక్షేమం కోసం వారి జీవన ప్రమాణాలు పెంచేందుకు నేరుగా వారి ఖాతాల్లో నగదు జమచేసింది. ఇప్పుడు ఇదే తరహాలో చేనేతల కోసం సరికొత్త పథకాన్ని రేపు శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించనుంది.

రాష్ట్రంలో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాకి రూ.24 వేల ఆర్థిక సహాయం ఒకే సారి వారి ఖాతాల్లో జమ చేయనుంది. వైఎస్సార్‌ నేతన్న హస్తం పేరున ఉన్న ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 85 వేల మంది చేనేతలు లబ్ధి పొందనున్నారు. చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి, వారి జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో జగన్‌ సర్కార్‌ ఈ పథకం ప్రవేశపెడుతోంది.

ప్రజా సంకల్పపాదయాత్ర పేరుతో దాదాపు ఏడాదిన్నర పాటు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రమంతా నడిచారు. ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్మృతి వనం నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం వరకు సాగింది. దారిపొడవునా ప్రజాసమస్యలు నేరుగా విని, చూసి తెలుసుకున్న జగన్‌ ఆయా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. హామీల అమలులో భాగంగానే రేపు వైఎస్సార్‌ నేతన్న హస్తం పథకం ప్రవేశపెట్టబోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి