iDreamPost

వైఎస్సార్‌ మత్స్యకార భరోసాకు సి.యం జగన్ గ్రీన్ సిగ్నల్

వైఎస్సార్‌ మత్స్యకార భరోసాకు సి.యం జగన్ గ్రీన్ సిగ్నల్

ఒక పక్క కరోనా వైరస్ కారణంగా ఆర్ధికంగా దేశంలోని అన్ని ప్రభుత్వాలు అనేక ఒడుదుడుకులు ఎదుర్కుంటున్నా ,ప్రజల సంక్షేమం దగ్గరకి వచ్చేసరికి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాను చెప్పిన సంక్షేమ పదకం ఎన్ని అడ్డంకులు వచ్చినా సమయానికి ప్రజలకు చేరవలసిందే అనే దృడ సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే కరోనా వైరస్ కట్టడి విషయంలో రాష్ట్రంలో అనేక చర్యలతో పాటు ప్రధానికి జోన్ ల వారి విభజన సలహా ఇచ్చి, ఇది దేశ వ్యాప్తంగా అమలు అయ్యేలా చేయడంలో సి.యం జగన్ సఫలీకృతం అయ్యారు. ఇలా ఒక పక్క కరోనా ని ఎదుర్కుంటూనే మరో పక్క సంక్షేమాన్ని సైతం సమర్ధవంతంగా ప్రవేశ పెడుతున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఇప్పటికే సున్నా వడ్డీ పధకం ప్రవేశ పెట్టి 1400 కోట్లు విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల 78 వేల గ్రూపుల్లోని 91 లక్షల మంది కి లబ్ది చేకూర్చారు, అలాగే జగనన్న విద్యాదీవెన పథకం కింద 4,000 కోట్లకు పైగా నిధులు ఒకేసారి విడుదల చేసి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మార్చి 31 వరకు ఒక్క రూపాయి బకాయి లేకుండా ఫీజుల రీయింబర్స్‌మెంట్‌లో పెట్టిన బకాయిలు దాదాపు రూ.1,880 కోట్లు చెల్లించారు, అలాగే 2019–20కు సంబంధించి ఫీజులు మొత్తం మార్చి 31వ తేదీ వరకు పూర్తిగా చెల్లించారు. ఇప్పుడు తాజాగ పాదయాత్రలో ఇచ్చిన వైఎస్సార్‌ మత్స్యకార భరోసా హమీని నెరవేర్చడానికి సిద్దమయ్యారు.

ప్రజాసంకల్ప యాత్రలో బాగంగా గంగపుత్రులకు తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మేలు జరిగేలా చేస్తాం అని ఇచ్చిన హామీ ప్రకారం జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. అయితే చేపల వేటపై నిషేదం కారణంగా ఈ ఏడాది మూడు నెలలు పాటు అంటే ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపల వేటను నిషేదించారు. గతంలో చేపల వేట నిషేద సమయంలో అందించే నెలకు 4000 రూపాయల జగన్ ప్రభుత్వం 10వేలకు పెంచిన నేపధ్యంలో లాక్ డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్న మత్స్యకారులకు ఉపశమనం కలిగించే విధంగా ఈ మొత్తం డబ్బును ఈ నెల 6వ తేది నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేయబోతున్నట్టు ప్రకటించారు. అర్హులైన మత్స్యకారుల జాబితాను ఆయా గ్రామాల పరిధిలోని సచివాలయాల్లో అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.9 లక్షల మంది మత్స్యకారులకు జగన్‌ సర్కార్‌ లబ్ది చేకూర్చబోతోంది.

మత్య్సకారుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో మత్స్య శాఖకు ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రూ.551 కోట్లు కేటాయించి గంగ పుత్రులపై తనకున్న చిత్తశుద్ధిని ప్రకటించున్న జగన్ తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఏడాదిలోపే మత్య్సకారులకు అనేక సంక్షేమ పధకాలు ప్రవశపెట్టారు సముద్రంలో చేపల వేటకు వెళ్ళి 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అదిస్తున్నారు. తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చి ఆమేరకు పనులు వేగవంతం చేశారు. కొత్త ఫిషింగ్‌ హార్బర్లు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. అలాగే గత ప్రభుత్వం లీటర్‌ డీజిల్‌కు ఇచ్చే రూ.6.03 రాయితీ మర పడవల నిర్వాహకులకు రూ.9కి పెంచారు. మరపడవలకే కాకుండా ఇంజను కలిగిన తెప్పలకూ డీజిల్‌ రాయితీ వర్తించేలా చర్యలు చేపట్టారు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ ప్రకటించారు. గుజరాత్‌, తమిళనాడులో చిక్కుకున్న మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయడానికి సీఎం వైఎస్‌ జగన్‌ చొరవ తీసుకున్నారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ భూబాగంలోకి పొరపాటున వెళ్ళి అక్కడి జైళ్లలో మగ్గుతున్న గంగపుత్రులని తిరిగి స్వదేశానికి తీసుకుని వచ్చేలా చర్యలు చేపట్టి సఫలీకృతం అయ్యారు.

ఇలా ఒక పక్క కరోనా ని కట్టడి చేస్తూనే రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాల వారికి సంక్షేమ పధకాలు చేరవేస్తు సంక్షోభంలో సైతం సంక్షేమాన్ని విడవకుండా సమర్ధవంతంగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తీరుని చూసి తలపండిన రాజకీయ విశ్లేక్షకులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రిగా జగన్ ఈ కష్టకాలన్ని సమర్ధవంతంగా ఏదుర్కుని తనలో ఉన్న పరిపాలనా దక్షతను ప్రతిపక్షాలకు రుచి చూపించినట్టు అయింది. కొత్తవాడు అనుభవం లేని వాడు అని పెదవి విరుపు విరిచిన వారికి తన పాలనతో గట్టి సమాదానమే చెబుతున్నారు జగన్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి