Idream media
Idream media
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి అనుచరుడు సూరీడుపై హైదరాబాద్లో దాడి జరిగింది. జూబ్లీహిల్స్లోని ఆయన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్ క్రికెట్ బ్యాట్తో సూరీడుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఇద్దరి మధ్య మనస్పర్థలు
సూరీడు కుమార్తె గంగా భవానీకి సురేంద్రనాథ్కు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త వేధింపులు భరించలేక భవానీ పుట్టింటికి వచ్చేసింది. అతడిపై గృహ హింస కేసు పెట్టింది.
కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి.!
తనపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని సురేంద్రనాథ్ భార్య భవానీ, మామ సూరీడుపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. వారు నిరాకరించడంతో కక్ష పెంచుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఆయన దాడికి పాల్పడగా సూరీడు తప్పించుకున్నాడు. దీంతో సురేంద్రనాథ్ ఏకంగా ఇంటికే వచ్చి దాడి చేయడం కలకలం రేపుతోంది. తమపై సురేంద్రనాథ్ దాడి చేశారని గంగా భవానీ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు సురేంద్రనాథ్పై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైఎస్ నీడలా ఒక వెలుగు వెలిగిన సూరీడు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన వ్యక్తిగత సహాయకునిగా సూరీడు ఒక వెలుగు వెలిగారు. వైఎస్ కు వెన్నంటి వుంటూ ఆయన నీడలా ఉండేవాడు. వైఎస్ అకాల మరణం తర్వాత సూరీడు పెద్దగా కనిపించలేదు. అయితే ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నిర్వహించిన సభలో ప్రత్యక్షమై … రేవంత్ రెడ్డిని చూస్తుంటే అచ్చం వైఎస్ రాజశేఖరరెడ్డి ని చూస్తున్నట్లు ఉందని వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత నుంచి కూడా ఆయన పెద్దగా మాట్లాడలేదు. ప్రస్తుత దాడి నేపథ్యంలో సూరీడు ఇంట్లో ఒక్కసారిగా కలకలం రేగింది.
Also Read : రామకృష్ణారెడ్డి నోట కక్ష సాధింపు మాటా .. ! నాడు అనపర్తిలో ఏం జరిగింది..?