iDreamPost

మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌కు సమాధానం ఉందా..?

మంత్రి పెద్దిరెడ్డి సవాల్‌కు సమాధానం ఉందా..?

రెఫరెండం.. రెఫరెండం అంటూ రంకెలేసిన నారా చంద్రబాబునాయుడికి బిగ్‌ కౌంటరే పడింది. ఏకంగా వైఎస్సార్‌సీపీ కీలకనేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా ముందుకొచ్చారు. త్వరలో రాష్ట్రంలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నికనే రిఫరెండంగా పెట్టుకోమని నేరుగా సవాల్‌ విసిరారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకోవాలని సూచించారు. దీంతో చంద్రబాబు చేసిన సవాల్‌కు ధీటుగాగానే సమాధానమిచ్చినట్టయింది.

అమరావతి ఉద్యమం ప్రారంభించి యేడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విపరీత ఆరోపణలకు దిగిన చంద్రబాబు సైడు నుంచి ఇంకా ఈ సవాల్‌కు సమాధానం రాకపోవడంతో అధికార వైఎస్సార్‌సీపీ శ్రేణుల నుంచి ప్రతి విమర్శలు ప్రారంభమైపోయాయి.

నిజానికి చంద్రబాబు పాలనలో ఎన్నిసార్లు రిఫరెండంకు వెళ్ళారు అంటూ ఆయన కామెంట్‌ చేసిన మరుక్షణం నుంచే సోషల్‌ మీడియాలో సెటైర్లు పడడం ప్రారంభమైంది. ఇష్టమొచ్చిన రీతిలో వ్యవహరించడం, ఆ తరువాత ప్రజలు ఎంతగా మొత్తుకుంటున్నా వినకపోవడం అన్నరీతిలోనే చంద్రబాబు పాలన సాగిందని గుర్తు చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు అధికార వైఎస్సార్‌సీపీని రిఫరెండంకు డిమాండ్‌ చేయడం పట్ల భారీగా విమర్శలు రేకెత్తాయి. 51శాతం మంది ప్రజలు వైఎస్సార్‌సీపికీ అనుకూలంగా ఓటు వేసి గెలిపించారని, ఇంకా రెఫరెండం దేనికని సూటిగా ప్రశ్నిస్తున్న ఆ పార్టీ నాయకులకు సమాధానం ఇచ్చే పరిస్థితి ప్రత్యర్ధి పార్టీల నుంచి కన్పించడం లేదంటున్నారు.

సవాల్‌ చేస్తే స్పందించలేదని చెప్పుకునేందుకు ఒక అవకాశాన్ని సృష్టించుకున్న చంద్రబాబుకు, ఇప్పుడు పెద్దిరెడ్డి చేసిన సవాల్‌తో బాల్‌ మళ్ళీ బాబు కోర్టులోకే చేరినట్టయింది. ఇప్పుడు ఎదురైన సవాల్‌కు స్పందించకపోతే అమరావతి పోరాట వేదికపై నుంచి చేసిన సవాల్‌ ఉత్తదేనని తేలిపోతుంది. బాబు యూటర్న్‌లు తీసుకోవడం మానలేదని ప్రజలు ఖరారు చేసేస్తారు. ఒక వేళ స్పందించి సవాల్‌ను స్వీకరిస్తే తిరుపతి పార్లమెంటు పరిధిలో పరిస్థితి టీడీపీకి ఏమంత అనకూలంగా లేదు. దీంతో మా నాయకుడికి పెద్ద కష్టమే వచ్చిపడిదంటూ టీడీపీ నాయకులు నొచ్చుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. అభ్యర్ధిని ప్రకటించేసి పక్షం పైనే దాటుతున్నప్పటికీ తిరుపతిలో టీడీపీ కనీసం ప్రచారం కూడా చేయడం లేదని ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పెద్దిరెడ్డి చేసిన సవాల్‌ను అంగీకరిస్తూ తిరుపతి ఎన్నికనే రెఫరెండంగా తీసుకుంటే బాబుకు బొప్పితగలకమానదంటున్నారు. అందుకే తాను మాట్లాడదల్చుకున్నదే చంద్రబాబు మాట్లాడుతూ.. తన క్యాడర్, అమరావతిలో ఉద్యమం చేస్తున్న వారిలో జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు.

సవాల్‌ చేయనేల.. ఎదుటివారికి అవకాశం ఇవ్వనేలా.. అంటూ చంద్రబాబు మీద ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జాలి కూడా కురిపిస్తున్నారు కొందరు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి