iDreamPost

కేఏ పాల్ ను చెంప దెబ్బ కొట్టినది ఎవరు..?

కేఏ పాల్ ను చెంప దెబ్బ కొట్టినది ఎవరు..?

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు.. ప్రముఖ సువార్తికుడు కేఏ పాల్ చెంప చెళ్లుమనిపించారు. పోలీసులున్న సమయంలోనే ఆయనపై దాడి జరగడం అందరినీ షాక్ కు గురిచేసింది. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులను పరామర్శించేందుకు వెళ్లిన కేఏ పాల్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు మార్గంమధ్యలో అడ్డుకున్నారు.

సిద్ధిపేట జక్కాపూర్ వద్ద కేఏ పాల్ పై జిల్లెల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ వ్యక్తిని పోలీసులు అడ్డుకున్నారు. స్తానిక టీఆర్ఎస్ నేతలే కేఏ పాల్ పై దాడికి దిగారని ప్రజాశాంతి పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా బస్వాపూర్ గ్రామంలో ఇటీవల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం హైదరాబాద్ నుంచి బస్వాపూర్ బయలుదేరారు. ఆయనను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేఏ పాల్ బస్వాపూర్ వెళితే ఉద్రిక్తత నెలకొంటుందని అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలోనే తనను ఎందుకు అడ్డుకుంటున్నారని పోలీసులతో కేఏ పాల్ వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ కార్యకర్త అనిల్ పోలీసులను నిలదీస్తున్న కేఏ పాల్ పై దాడి చేశాడు. పోలీసుల సమక్షంలోనే పాల్ చెంపపై కొట్టాడు. పోలీసులు అనిల్ ను అడ్డుకున్నారు.

ఇక తనపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. డీఎస్పీ సమక్షంలోనే తనపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తనను హత్య చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు వచ్చాయని ఆరోపించారు. ఈ దాడి అనంతరం పోలీసులు కేఏ పాల్ ను హైదరాబాద్ పంపించారు.

ఇక కేఏపాల్ పై దాడి చేసిన టీఆర్ఎస్ కార్యకర్త అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లెల్లకు చెందిన అనిల్ రెడ్డిగా గుర్తించారు. ఇతడు టీఆర్ఎస్ యూత్ నాయకుడిగా.. నేరెళ్ల సింగిల్ విండో డైరెక్టర్ గా ఉన్నారు. అనిల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి