iDreamPost

Anudeep : జాతిరత్నాలు డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్ ఇదేనా

Anudeep : జాతిరత్నాలు డైరెక్టర్ కొత్త ప్రాజెక్ట్ ఇదేనా

ఈ ఏడాది ప్రారంభంలో పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన జాతిరత్నాలుని ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ చేసిన దర్శకుడు అనుదీప్ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దానికే సీక్వెల్ తీస్తారని ప్రచారం జరిగింది కానీ ఎందుకో అది ముందుకు సాగలేదు. ఓటిటి రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో వ్యక్తమైన అభిప్రాయాలు, నెగటివ్ ఫీడ్ బ్యాక్ చూసి ఏమైనా పునరాలోచనలో పడ్డారో ఏమో తెలియదు. మొత్తానికి యుఎస్ లో తీయాలని ప్లాన్ చేసుకున్న రెండో భాగం మాత్రం ఆగిపోయిందని అర్థమయ్యింది. మరి ఎప్పుడు ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి. ఈ లోగా అనుదీప్ కు సీనియర్ హీరోతో ఓ క్రేజీ కాంబినేషన్ సెట్ అయ్యిందని ఫిలిం నగర్ టాక్.

విక్టరీ వెంకటేష్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లో ఓ సినిమా ఉండొచ్చని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. అఫీషియల్ గా చెప్పలేదు కానీ ప్రాథమికంగా ఓకే అయ్యిందని అంటున్నారు. నిజానికి ఈ బ్యానర్ లో వెంకీ త్రివిక్రమ్ జట్టు కడతారని గతంలోనే వార్త వచ్చింది. కానీ దానికి ఆలస్యం అవుతుండటంతో ఇప్పుడీ ప్రాజెక్ట్ ని లైన్ లోకి తెచ్చినట్టు తెలిసింది. తరుణ్ భాస్కర్ తోనూ ఓ చిత్రం కమిటైన వెంకీ దాని కథ విషయంలో ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదట. అందుకే లేట్ అవుతోందని అంటున్నారు. కామెడీ టైమింగ్ మీద అద్భుతమైన పట్టున్న అనుదీప్ కి వెంకీ తోడైతే వచ్చే నవ్వుల గురించి వేరే చెప్పాలా.

ఈ ఏడాది నారప్ప, దృశ్యం 2 రూపంలో రెండు ఓటిటి రిలీజులు దక్కించుకున్న వెంకటేష్ ఎఫ్3 తో మళ్ళీ థియేటర్లలో కనిపించబోతున్నారు. దీని తర్వాత చేయబోయే సినిమా మాత్రం ఇప్పటిదాకా కన్ఫర్మ్ చేయలేదు. ఏవేవో పేర్లు వినిపించాయి కానీ ఫైనల్ కాలేదు. ఆ మధ్య జరిగిన ప్రెస్ మీట్స్ లోనూ వెంకటేష్ ఇదే చెబుతూ వచ్చారు. సో ఇప్పటికే చాలా గ్యాప్ తీసుకున్న అనుదీప్ తో టైఅప్ కావడం మంచి ఆలోచనే. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సితార సంస్థ రెండు కొత్త సినిమాలు హిందీ జెర్సీ డిసెంబర్ 31, భీమ్లా నాయక్ జనవరి 12 కేవలం రెండు వారాల గ్యాప్ లోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Also Read : RRR Trailer : అభిమానులు తిట్టుకున్నా సరే ఆయనే కరెక్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి