iDreamPost

ఉద్యోగం మారినా మారని వెంకటకృష్ణ ధోరణి ..

ఉద్యోగం మారినా మారని వెంకటకృష్ణ ధోరణి ..

’ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రయిన ఆరు నెలల్లోగా అమల్లోకి తెచ్చింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే’.

’గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత స్పీడుగా హామీల అమలు మొదలుపెట్టలేదు. ఏదో ఒకటో రెండో సంతకాలు చేశారంతే’.

’కానీ జగన్ మాత్రం మొత్తం నవరత్నాల హామీలనే ఆరుమాసాల్లో అమల్లోకి తెచ్చేశాడు’.

పై వ్యాఖ్యలు చదివిన తర్వాత సాక్షి టివిలో జరిగిన చర్చా కార్యక్రమంలో చేసిందని అనుకుంటే పొరబాటు పడినట్లే. సాక్ష్యాత్తుగా జగన్మోహన్ రెడ్డే ఎల్లోమీడియాగా చెబుతున్న ఏబిఎన్ ఛానల్ వినిపించిన వ్యాఖ్యలు. సోమవారం రాత్రి జరిగిన డిబేట్ లో అనేక అంశాలపై చర్చ జరిగింది. చర్చలో సీనియర్ జర్నలిస్టు వెంకటకృష్ణ యాంకర్ గా పాల్గొన్నాడు. ఈ యాంకర్ ఈమధ్యనే ఏపి 24X7 ఛానల్ నుండి ఏబిఎన్ లో చేరాడు.

ఏపి 24 X7లో ఉన్నపుడైనా అయినా కొత్తగా ఏబిఎన్ ఛానల్ చేరిన తర్వాత అయినా వెంకటకృష్ణ జరిపే డిబేట్ లో జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లే కార్యక్రమం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరికీ రింగ్ మాస్టర్ చంద్రబాబునాయుడు కాబట్టే. వీళ్ళెక్కడున్నా చంద్రబాబు ప్రయోజనాలను రక్షించటానికి మాత్రమే పనిచేస్తారు. అలాంటిది కొత్తగా ఏబిఎన్ ఛానల్లో చేరిన వెంకట్ జగన్ పై పాజిటివ్ కామెంట్లు చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అయితే జగన్ పై ఎందుకు పాజిటివ్ కామెంట్లు చేశాడు ? ఎందుకంటే ఆరుమాసాల్లోనే హామీలన్నింటినీ ఆచరణలోకి తెచ్చిన జగన్ తర్వాత లబ్దిదారులకు ఇచ్చిన డబ్బులను మళ్ళీ వెనక్కు తీసేసుకుంటున్నాడు అనే ఆరోపణ చేయటానికి మాత్రమే. అంటే ఒక చేత్తో లబ్దిదారులకు డబ్బులు ఇచ్చి మరో చేత్తో విద్యుత్ ఛార్జీలు, బస్సు ఛార్జీలు, పెట్రోలు ఛార్జీలు, మద్యం ధరలు ఇలా.. అన్నీ పెంచేసి మళ్ళీ డబ్బులు లాగేసుకుంటున్నాడట.

ఇక్కడ యాంకర్ మరచిపోయినదేమంటే ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు పెంచింది ఇపుడు కాదు. కరోనా వైరస్ సమస్య మొదలు కాకముందే అంటే పోయిన బడ్జెట్ సమయంలోనే ధరలు పెంచాడు. పెంచిన ధరలు కూడా చాలా తక్కువనే చెప్పాలి. పెరిగిన ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు అందరి మీద కాదు. కేవలం కొన్ని తరగతుల జనాల మీద మాత్రమే పెంచాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ అంశాలపై అప్పట్లోనే ఎల్లోమీడియా వ్యతిరేక కథనాలు అచ్చేసింది. దానికి మంత్రులు సమాధానాలు కూడా చెప్పేశారు.

అయితే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చేనాటికి కరోనా వైరస్ సమస్యతో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది కాబట్టి పెంపుదల అమల్లోకి రాలేదంతే. ఏదేమైనా ఎల్లోమీడియాగా జనాల్లో ముద్రపడిన ఛానల్లో జగన్ గురించి పాజిటివ్ గా మాట్లాడిన క్లిప్పింగులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అసలు జగన్ లో నెగిటివ్ మాత్రమే చూడటానికి అలవాటు పడిపోయిన వాళ్ళు పాజిటివ్ గా చెబుతుంటే వినటానికే ఆశ్చర్యంగా ఉంది. మరి ఈ కొత్త కోణం ఎక్కడికి దారితీస్తుందో చూడాల్సిందే ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి