iDreamPost

రాధేశ్యామ్ దర్శకుడికి మూడో ఛాన్స్ ఇచ్చిన యూవీ!

రాధేశ్యామ్ దర్శకుడికి మూడో ఛాన్స్ ఇచ్చిన యూవీ!

ఎంతటి దర్శకుడికైనా ఒక ఘోర పరాజయం తర్వాత మరో అవకాశం రావడం అంత సులభం కాదు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ చేయబోయే సినిమా ఆగిపోతుందేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఒక దర్శకుడు కెరియర్ పై ఫ్లాఫ్ అంతటి ప్రభావం చూపుతుంది. కానీ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మాత్రం.. భారీ డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కి ముచ్చటగా మూడోసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

గోపీచంద్ హీరోగా యూవీ క్రియేషన్స్ నిర్మించిన జిల్ చిత్రంతో రాధాకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ చిత్రం స్టైలిష్ గా ఉందని టాక్ తెచ్చుకుంది కానీ మంచి విజయాన్ని నమోదు చేయలేదు. అయినప్పటికీ యూవీ క్రియేషన్స్ ప్రభాస్ తో ఒక భారీ బడ్జెట్ చిత్రాన్ని రూపొందించే అవకాశాన్ని రాధాకృష్ణకి ఇచ్చింది. కానీ రాధాకృష్ణ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఎపిక్ లవ్ స్టోరీ అంటూ ప్రభాస్ తో రాధేశ్యామ్ చిత్రాన్ని తెరకెక్కించి తీవ్ర నిరాశపరిచాడు. ఈ చిత్రం ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. అయితే రాధేశ్యామ్ తో దారుణంగా నిరాశపరిచినప్పటికీ రాధాకృష్ణ ప్రతిభ పై యూవీకి నమ్మకం పోలేదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

జిల్ తో పర్లేదు అనిపించుకొని, రాధేశ్యామ్ తో నిరాశపరిచిన రాధాకృష్ణకు మూడో అవకాశం ఇవ్వడానికి యూవీ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తమిళ్ హీరో ధనుష్ నటించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే ధనుష్ కి రాధాకృష్ణ స్టోరీ లైన్ వినిపించగా.. ఆయన ఇంప్రెస్ అయినట్లు టాక్. డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్ ఈమధ్య తెలుగు దర్శకులతో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ చిత్రంతోపాటు.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇక తాజాగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న చిత్రానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి