iDreamPost

ఉదయ్ కిరణ్ చివరి సినిమా వస్తోంది

ఉదయ్ కిరణ్ చివరి సినిమా వస్తోంది

20 ఏళ్ళ క్రితం బక్కపలచని దేహంతో అసలు హీరోగా పనికొస్తాడా అని అనుమానం కలిగించిన ఉదయ్ కిరణ్ అతి తక్కువ టైంలోనే యూత్ సెన్సేషన్ గా మారిపోవడం అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు.చిత్రంతో పరిచయమై నువ్వు నేనుతో రెండు సినిమాలకే ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఉదయ్ కిరణ్ ఆ తర్వాత ప్రేమ కథలు, మాస్ స్టోరీస్ ఎంపికలో జరిగిన తడబాటు వల్ల ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగలేకపోయాడు. వ్యక్తిగత జీవితంలోనూ ఇబ్బందులు ఎదురుకావడంతో కొంత కాలం మేకప్ కు దూరంగా ఉన్న ఈ కుర్రాడు అడపాదడపా చిత్రాలు చేస్తూనే వచ్చాడు కాని అవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయి .

2013లో వచ్చిన జై శ్రీరామ్ ఆఖరిసారి ఉదయ కిరణ్ తెరమీద కనిపించిన మూవీ. ఫలితం డిజాస్టరే. ఇది కాకుండా ‘చిత్రం చెప్పిన కథ’ అనే మరో సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ సిద్ధమయ్యాక ల్యాబులోనే ఆగిపోయింది. ఆ టైంలోనే దాన్ని విడుదల చేయాలనీ చాలా ప్రయత్నించారు కాని కుదరక వదిలేశారు. ఇన్నేళ్ళకు దానికి మోక్షం కలిగినట్టుగా టాక్. అయితే ధియేటర్లలో కాకుండా నేరుగా ఓటిటి ద్వారా రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మోహన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ముగ్గురు హీరొయిన్లు.

మదాలస శర్మ, గరిమ, డింపుల్ లు ఉదయ్ కిరణ్ తో ఆడిపాడగా నువ్వు నేను ఫేం అనితా కూడా స్పెషల్ క్యామియో చేసింది. ఏదో థ్రిల్లర్ జానర్ అన్నారు కాని అంతకు మించి డీటెయిల్స్ బయటికి రాలేదు. ఒకవేళ నిజంగా ఓటిటిలో విడుదల చేస్తే మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ దీని కోసం ఎదురు చూస్తున్నారు.సామాన్య ప్రేక్షకులు సైతం ఓ జ్ఞాపకం కోసం లుక్ వేసే ఛాన్స్ ఉంది. కొత్త సినిమాలే డిజిటల్ దారి పడుతున్న తరుణంలో ఇలా ఎప్పుడో ఆగిపోయిన సినిమాకు ఇంత కన్నా మంచి ఆప్షన్, ఛాన్స్ దొరకదు. మరి ఏ ప్లాట్ ఫార్మ్ పై వస్తుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి