iDreamPost

Revanth Reddy AS CM: ఘనంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం దానిపైనే పెట్టారు!

  • Published Dec 07, 2023 | 1:35 PMUpdated Dec 07, 2023 | 1:55 PM

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

  • Published Dec 07, 2023 | 1:35 PMUpdated Dec 07, 2023 | 1:55 PM
Revanth Reddy AS CM: ఘనంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం దానిపైనే పెట్టారు!

తెలంగాణ తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి నేడు ప్రమాణస్వీకారం చేశారు. డిసెంబర్ 7, గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ కొత్త సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని ఇతర పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు, ఆత్మీయ అతిథులుగా తెలంగాణ ఉద్యమకారులను ఆహ్వానించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం పంపింది.

గవర్నర్ తమిళిసై.. తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ రెడ్డి అను నేను తెలంగాణ సీఎంగా అనగానే సభా ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. నేడు ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ స్టేడియం వేదికయ్యింది. మొత్తం మూడు వేదికల ఏర్పాటు చేయగా.. ప్రధాన వేదికపై ప్రమాణ స్వీకార కార్యక్రమం, ఎడమవైపున 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక, కుడిపక్కన వీవీఐపీల కోసం 150 సీట్లతో మరో వేదిక ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులు రేవంత్‌కి స్వాగతం పలికారు. అలానే ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన అమరవీరుల కుటుంబాల కోసం వేదిక కింద 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ ఏర్పాటు చేశారు. 30 వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా కుర్చీలను వేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. నేడు సీఎం ప్రమాణ స్వీకారోత్సం కార్యక్రమం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.  ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాంతో ఏఐసీసీ నేతలకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. పలువురు నేతలు.. అసెంబ్లీ సమీపంలోని అమరవీరుల స్థూపం దగ్గర ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాన్వాయ్ రవీంద్రభారతి దగ్గర ట్రాఫిక్ లో చిక్కుకోగా.. ఆయనతో పాటు, డీకే శివకుమార్ కూడా కాన్వాయ్ వదిలేసి నడుచుకుంటు వెళ్లారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి