iDreamPost

విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ ఆటో బోల్తా…

విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ ఆటో బోల్తా…

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాలను దుర్భరంగా గడుపుతున్నారు. ప్రమాదాల నివారణకు పోలీసులు, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీలో ఓ స్కూల్ ఆటో ప్రమాదానికి గురైంది. ఈప్రమాదంలో ఒక విద్యార్థిని మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇబ్రహీంపట్నం మండలంలోని గుంటుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.  గుంటుపల్లి డాన్ బాస్కో పాఠశాలకు భవానీపురం , విద్యాధరపురం,గొల్లపూడి ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్థులు రోజూ ఆటోలో వచ్చి వెళ్తుంటారు. అలానే మంగళవారం కూడా పాఠశాల ముగిసిన అనంతరం 14 మంది విద్యార్థులతో 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఆటో వెళ్తోంది. ఇదే  సమయంలో ఓ బైక్ రాంగ్ రూట్ లో ఆటోకు ఎదురుగా వచ్చింది. రాంగ్ రూట్ లో ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోయి అదుపు తప్పి ఆటో పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో విద్యాధరపురం కామకోటినగర్ ప్రాంతానికి చెందిన పరువాల ఆనంద్ కుమార్తె నవ్యశ్రీ(10)మృతి చెందింది. మరో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. నవ్యశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి మృతి ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిరునవ్వుతో ఇంటి నుంచి స్కూల్ కి వెళ్లిన తమ బిడ్డ విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇలా కొందరు వెదవలు చేసే తప్పులకు అమాయకులు బలవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. రాంగ్ రూట్, అతివేగం, నిర్లక్ష్యంగా వచ్చి  ప్రమాదాలకు కారణమయ్యే వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. మరి.. ఈ ప్రమాదానికి బాధ్యులు ఎవరు? వారికి ఎలాంటి శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి