iDreamPost

కరివేపాకు కోసం బయటకు వెళ్లి…విగత జీవిగా వివాహిత!

కరివేపాకు కోసం బయటకు వెళ్లి…విగత జీవిగా వివాహిత!

భర్త, పిల్లలు, అత్తమామలతో కలిసి ఆ మహిళ ఎంతో సంతోషంగా ఉంది. పిల్లలను పాఠశాలకు పంపిస్తూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఆమె జీవితం సాగిపోతుంది. సాయంత్రం కాగానే కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చోని ముచ్చట్లు చెప్పుకునే వారు. అలా సాగిపోతున్న ఆ మహిళపై విధి కన్నెర్ర చేసింది. వినాయక చవితి  రోజు ఎంతో ఘనంగా పూలు నిర్వహించి.. చుట్టుపక్కల అందరికి ప్రసాదాలు పంచిపెట్టింది. మరుసటి రోజే విగతజీవిగా మారిపోయింది. ఈ విషాద ఘటన పార్వతీపురం మన్యంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

పార్వతీపురం మన్యం గంట్యాడ మడలంలోని పెదమజ్జిపాలెం గ్రామానికి చెందిన పైల అంజలి(28),పైల రామకృష్ణ భార్యాభర్తలు. రామకృష్ణ స్థానికంగా ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అత్తమామలతో పాటే అంజలి కలిసి ఉంటోంది. పెద్దకుమారుడు భానుప్రకాష్‌ తామరాపల్లి కూడలిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నాడు. నిత్యం పిల్లలకు లంచ్ బాక్స్ పెట్టి.. స్కూల్ కి పంపిస్తుంది. అనంతరం తన ఇంటి పనుల్లో అంజని నిమగ్నమయ్యేవారు. అలానే మంగళవారం ఉదయం కూడా బాబుకు లంచ్ బాక్స్ కోసం వంట చేసేందుకు సిద్ధమైంది. ఇదే సమయంలో వంటలోకి కాస్తా కరివేపాకు అవసరం అయింది.

ఆ కరివేపాకు తెచ్చేందుకు సమీపంలో ఉన్న చెట్టు వద్దకు వెళ్లింది. కరివేపాకు కోస్తూ ఉండగా అంజలిని పాము కాటు వేసింది. పాము కాటుకు గురైన అంజలిని కుటుంబ సభ్యులు గమనించారు. వారు స్పందించి వెంటనే అంజలిని స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి బయలుదేరారు. అప్పటికే పరిస్థితి విషమించి అంజలి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ రమణమూర్తి తెలిపారు. డెంకాడ మండలం మోపాడ గ్రామానికి చెందిన అంజలి తల్లి కూడా ఐదేళ్ల క్రితం పాముకాటుతో మరణించారు. మరి.. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి