iDreamPost

పండక్కి అత్తారింటికి బయలుదేరిన నవదంపతులు.. అంతలోనే

సంక్రాంతి వచ్చిందోయ్ తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త అల్లుళ్లతో, కోడి పందాలతో.. అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అత్తారింట్లో మర్యాదలు పొందేందుకు కొత్త అల్లుళ్లు పయనం అవుతున్నారు. అలా వెళ్లి..

సంక్రాంతి వచ్చిందోయ్ తుమ్మెద, సరదాలు తెచ్చిందే తుమ్మెద, కొత్త అల్లుళ్లతో, కోడి పందాలతో.. అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అత్తారింట్లో మర్యాదలు పొందేందుకు కొత్త అల్లుళ్లు పయనం అవుతున్నారు. అలా వెళ్లి..

పండక్కి అత్తారింటికి బయలుదేరిన నవదంపతులు.. అంతలోనే

తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే అతి పెద్ద పండుగల్లో ఒకటి సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ల పండుగ. పెళ్లి చేసి కూతుర్ని ఒకంటికి పంపించాక.. అది దూరమైనా,దగ్గరైనా సంక్రాంతి పండుగకు కొత్త అల్లుడ్ని ఇంటికి పిలవాల్సిందే. దంపతులకు కొత్త బట్టలు పెట్టాల్సిందే. ఏ పండుగకు వెళ్లినా, వెళ్లపోయినా.. పెద్ద పండుగకు అత్త ఇంటికి వెళ్లి.. మర్యాదలు పొందుతాడు అల్లుడు. భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజులు అత్త మామలు చేసిన పిండి వంటలు తిని, కక్క ముక్క ఆరగించి, సరదాగా ఎంజాయ్ చేస్తుంటాడు. అల్లుడు వచ్చాడని.. ఎక్కడలేని మర్యాదలు చేస్తుంటారు అత్తింటి వారు. పండుగకు అల్లుడు, కూతురు వచ్చారన్న సంబరంలో ఆనందంలో అడిగినవన్నీ కాదనకుండా అందిస్తారు కూతురు తల్లిదండ్రులు.

ఇక నవ దంపతులైతే.. ఆ లెక్కలే వేరు. కొత్త పండుగ నాడు.. అత్తారింట్లో రాచ మర్యాదలే జరుగుతాయి. ఇవి ఎంజాయ్ చేసేందుకు వెళుతుండగానే.. మృత్యువాత పడ్డారు ఓ జంట. పెళ్లై ఆరు నెలలు కూడా గడవకుండానే.. ముద్దు ముచ్చట తీరకుండానే మృత్యువు కబళించింది. ఈ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో చోటుచేసుకుంది. పెనగలూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉదయగిరి భార్గవ్‌తో రాజంపేటకు చెందిన లక్ష్మి దేవికి 5 నెలల క్రితమే వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ జంట రైల్వే కోడూరులో జీవిస్తున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో.. ఇంటికి రావాలని పిలిచారు అత్తమామలు.

భార్గవ్ ఆటోలో ఫ్రిజ్, ఇతర సామాన్లు తీసుకుని భార్యతో సహా వెళుతుండగా.. రాఘవరాజపురం ప్రధాన దారిలో వాహనం ప్రమాదానికి గురైంది. బోరు పైపుల లోడుతో వెళుతున్న లారీ.. వీరి వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జుయ్యింది. ఈ ప్రమాదంలో భార్గవ్, లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి.. శవ పరీక్ష నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. మరికొన్ని గంటల్లో అత్తారింటికి చేరాల్సిన నవదంపతులు..స్మశాన వాటికకు వెళ్లాల్సి రావడంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. ప్రస్తుతం లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పండుగ వేళ పెను విషాదం నెలకొనడంతో ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి