iDreamPost

రిస్క్ అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్

రిస్క్ అంటున్న డార్లింగ్ ఫ్యాన్స్

లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడకపోయి ఉంటే ప్రభాస్ హీరోగా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఈపాటికి ముప్పాతిక శాతం పూర్తయ్యేది. జూన్ నుంచి పరిస్థితిని బట్టి తిరిగి షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. ఇప్పటిదాకా ఓ 40 శాతం కంప్లీట్ అయినట్టుగా యూనిట్ టాక్. ఇదిలా ఉండగా దీనికి ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ కాలేదు. సైరా, నాని వికి మ్యూజిక్ ఇచ్చిన బాలీవుడ్ అమిత్ త్రివేదిని అనుకున్నారు కాని ఏవో కారణాల వల్ల ఆయన డ్రాప్ అయ్యారు. ప్రస్తుతం ఎవరిని తీసుకోవాలనే దాని గురించి దర్శక నిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. వాళ్ళకు ఇప్పుడు బెటర్ ఆప్షన్ గా ఏఆర్ రెహమాన్ కనిపిస్తున్నారట.

తెలుగు స్ట్రెయిట్ మూవీకి రెహమాన్ మ్యూజిక్ ఇచ్చి చాలా కాలం అయ్యింది. ఏ మాయ చేశావే, సాహసం శ్వాసగా సాగిపో మన సినిమాలే కాని అవి బైలింగ్వల్ కాబట్టి వాటిని డైరెక్ట్ కౌంట్ లోకి తీసుకోలేం. వీటిని మినహాయిస్తే టాలీవుడ్ లో రెహమాన్ ఇచ్చిన లాస్ట్ ఆల్బమ్స్ కొమరం పులి, నాని. ఇవి ఎంత పెద్ద డిజాస్టర్లు అనే సంగతి పక్కనబెడితే సంగీత పరంగానూ ఒకటి రెండు పాటలు తప్పించి ఈ ఆల్బమ్స్ తీవ్రంగా నిరాశపరిచినవే. అప్పుడెప్పుడో రెహమాన్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు చేసిన గ్యాంగ్ మాస్టర్, పల్నాటి పౌరుషం, సూపర్ పోలీస్ లాంటివి కూడా వర్క్ అవుట్ కాలేకపోయాయి. అన్ని అగ్ర హీరోల చిత్రాలే.

ఒకరకంగా చెప్పాలంటే రెహమాన్ ఎక్కువగా అద్బుతాలు సృష్టించింది తమిళ సినిమాలతోనే. ఎంత లెజెండ్ అయినా రెహమాన్ మునుపటి మేజిక్ చేయలేకపోతున్న మాట వాస్తవం. అలాంటాప్పుడు ప్రభాస్ 20కి అదిరిపోయే ట్యూన్స్ ఇవ్వగలరా అనేదే అభిమానుల్లో రేగుతున్న సందేహం. అలా అనుకోవడంలో లాజిక్ కూడా ఉంది. మరి పాన్ ఇండియా కోసం రెహమాన్ ని తీసుకున్నా ప్రభాస్ రేంజ్ కి తగ్గ అవుట్ పుట్ ఇవ్వగలడా లేదా అనేదే అనుమానం. ఏదోకటి వచ్చే రెండు మూడు వారాల్లో డిసైడ్ అయిపోవాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ యూరోప్ నేపథ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా ఉంటుందని ఇన్ సైడ్. మధ్యలోనే రద్దు చేసుకుని వచ్చిన జార్జియా షెడ్యూల్ ని ఎక్కడ కొనసాగిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి