సచిన్‌కు సైతం సాధ్యం కాని రికార్డు సాధించిన నెదర్లాండ్స్‌ క్రికెటర్‌!

క్రికెట్‌లో ఏ రికార్డు ఎప్పుడు బద్దలవుతుందో, కనీవిని ఎరుగని రికార్డు ఎప్పుడు క్రియేట్‌ అవుతుందో చెప్పడం చాలా కష్టం. తాజాగా అలాంటి ఓ వరల్డ్‌ రికార్డు నమోదైంది. క్రికెట్‌లో పసికూన టీమ్‌ సభ్యుడు ఏకంగా వీవీఎన్‌ రిచర్డ్స్‌ సరసన చేరాడు. వినేందుకు ఆశ్చర్యంగా ఉ‍న్నా.. ఇది నిజం. నెదర్లాండ్స్‌ ఆటగాడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. భారత్‌ వేదికగా జరిగే 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో ఆడేందుకు జరిగిన క్వాలిఫైయర్స్‌ ట్రోర్నీలో ఈ సంచలనం నమోదైంది.

క్వాలిఫైయర్స్‌లో భాగంగా నెదర్లాండ్స్‌-స్కాట్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ ఆటగాడు బాస్‌ డీ లీడే సంచలనం సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసిన బాస్‌.. ఏకంగా 92 బంతుల్లోనే 123 పరుగులు సాధించాడు. సెంచరీతోనే సరిపెట్టుకోలేదు.. బౌలింగ్‌లో అదరగొడుతూ.. స్కాట్లాండ్‌ వెన్నువిరిచాడు. ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగిపోయాడు. ఇలా ఓ వన్డే మ్యాచ్‌లో సెంచరీతో పాటు ఐదు వికెట్లు హాల్‌ సాధించిన తొలి నెదర్లాండ్స్‌ క్రికెట్‌గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే.. రిచర్డ్స్‌, కాలింగ్‌ వుడ్‌, రోహన్‌ ముస్తఫా తర్వాత ఒకే మ్యాచ్‌లో సెంచరీ చేసి, ఐదు వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా కొత్త చరిత్ర లిఖించాడు.

రికార్డుల రారాజు, ప్రపంచ క్రికెట్‌కు దేవుడిలా ఎదిగిన సచిన్‌ టెండూల్కర్‌కు సైతం ఈ రికార్డు లేదు. ఈ రికార్డు విషయంలో సచిన్‌ గురించి ప్రస్తావించేందుకు ఓ కారణం ఉంది. సచిన్‌ గొప్ప బ్యాటరే కాకుండే మంచి స్పిన్నర్‌ కూడా.. సచిన్‌కు వన్డేల్లో 154 వికెట్లు ఉన్నాయి. చాలా మంది స్పెషలిస్ట్‌ బౌలర్ల కంటే కూడా ఎక్కువ వికెట్లు తీశాడు సచిన్‌. అలాగే రెండు సార్లు ఐదు వికెట్ల హాల్‌ సాధించినా.. సెంచరీ చేసిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల హాల్‌ సాధించలేదు. అందుకే క్రికెట్‌ దేవుడికే సాధ్యం కానీ రికార్డును పసికూన టీమ్‌ ఆటగాడు సాధించడాని క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments