Tirupathi Rao
Tirupathi Rao
మెగాస్టార్ చిరంజీవి చేసిన పొలిటికల్ కామెంట్స్ ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచిన విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ఎందుకు సినిమాల గురించి మాట్లాడుతున్నాయి అంటూ చిరంజీవి ప్రశ్నించారు. అయితే ఆ వీడియోకి కంటిన్యుటిగా ఇంకొక వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో హీరోల రెమ్యూనరేషన్ గురించి రాజ్యసభలో చర్చ ఎందుకు చేస్తున్నారు? అంటూ అందులో చిరంజీవి ప్రశ్నిస్తున్నారు. ఈ కామెంట్స్ పై ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. మెగాస్టార్ వ్యాఖ్యలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
సినిమా రంగం, రాజకీయాలపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా స్టార్లు, పొలిటీషియన్స్ ఎవరైనా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ ఉంటుంది. సినిమా రంగంలో ఉండే పేదలు, కార్మికుల బాధ్యత కూడా ప్రభుత్వానిదే అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన రెండు ట్వీట్లు చేశారు. “సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ. సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. వాళ్ళూ మనుషులే. వారి గురించి మీకెందుకు, వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదు. వారి యోగక్షేమాల పట్టించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది” అంటూ చెప్పుకొచ్చారు.
మరో ట్వీట్ లో కొందరికి హ్యాట్సాఫ్ చెప్పారు. “కొందరు సినిమా హీరోలు పాపం చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొంటూ, వీలయితే ఉచితంగా నటిస్తూ….లక్షలాది డైలీ వేజ్ సినీ కార్మికులను బతికిస్తున్నారు. కళామతల్లిపై ప్రేమతో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తలసరి ఆదాయం, స్థూల రాష్ట్ర ఉత్పత్తి వృద్ధి కోసం అహర్నిశలూ చెమటోడుస్తున్నారు. అలాంటి వారికి హాట్సాఫ్” అంటూ ట్వీట్ చేశారు. సినిమాటోగ్రాఫ్ బిల్లుపై పార్లమెంటులో మాట్లాడితే కోట్లకు పడగలెత్తిన కొందరు హీరోలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. సినిమా పైరసీని అరికట్టడం ఎంత ముఖ్యమో.. సినిమా కార్మికుల సంక్షేమం, సినీ పరిశ్రమలో పనిచేసే మహిళల భద్రత కూడా అంతే అవసరమని వ్యాఖ్యానించారు. అసలు ఉన్నమాట అంటే ఉలుకెందుకు అంటూ ప్రశ్నించారు.