iDreamPost
iDreamPost
మొదటి చూపులోనే ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకుని ప్రేమలో గెలిచారు కానీ.. జీవితంలో ఓడిపోయారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక దంపతులు అసువులు బాశారు. ఈ విషాద ఘటన రామంతాపూర్ లో జరిగింది. హైదరాబాద్ లోని రామంతాపూర్ శ్రీనగర్ కాలనీకి చెందిన కొత్త సాయిగౌడ్ (30), మీర్ పేటకు చెందిన సందూర్ నవనీత (28)కు మౌలాలిలోని ఓ సూపర్ మార్కెట్లో పరిచయం అయింది. ఆ పరిచయం స్నేహంగా, క్రమంగా ప్రేమగా మారింది. వీరిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విషయం ఇద్దరి ఇళ్లలో చెప్పగా.. ఇరు కుటుంబాల పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు.
దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10వ తేదీన ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుని, రామంతాపూర్ లోని శ్రీనగర్ కాలనీలో ఓ ఇల్లుకు అద్దెకు తీసుకుని, అక్కడే కాపురం ఉంటున్నారు. నవనీత ప్రైవేట్ కాల్ సెంటర్లో పనిచేస్తుండగా.. సాయిగౌడ్ పెస్ట్ కంట్రోల్ ఉద్యోగం చేసేవాడు. పెళ్లైన కొన్నాళ్లకు ఉద్యోగం పోవడంతో సాయి మద్యానికి బానిసయ్యాడు. నిత్యం మద్యం సేవించి ఇంటికి రావడంతో నవనీత – సాయి ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఇదే విషయాన్ని నవనీత తల్లిదండ్రులకు చెప్పేది కానీ.. అల్లుడితే వాళ్లేమి మాట్లాడేవారు కాదు.
ఈక్రమంలో శుక్రవారం (జూన్ 24) నుంచి నవనీత సోదరుడు నవీన్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. శనివారం ఉదయం రామంతాపూర్ లోని సోదరి ఇంటికొచ్చి చూడగా.. నవనీత – సాయి విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే నవీన్ పోలీసులకు సమాచారమివ్వగా.. వారు ఘటన ప్రాంతానికి వచ్చారు. తొలుత నవనీత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా.. ఆ తర్వాత సాయిగౌడ్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.