భారత్‌ లో ‘ఎక్స్‌ఈ’ తొలి కేసు ?

మరో కొత్త వేరియంట్‌ ప్రమాదం పొంచి ఉందంటూ వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే కరోనా కొత్త వేరియంట్‌ ‘ఎక్స్‌ఈ’కి సంబంధించిన మొట్టమొదటి కేసును గుర్తించామంటూ ముంబై మునిసిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) బుధవారం ప్రకటించింది. కప్పా వేరియంట్‌కు సంబంధించిన మరో కేసు కూడా బయటపడిందని వెల్లడించింది. ఈ ఇద్దరు రోగుల శాంపిళ్లతో పాటు ఒమైక్రాన్‌ బీఏ.2 వేరియంట్‌ సోకిన మరో 228 మంది నమూనాలను జన్యుక్రమ విశ్లేషణ (జీనోమ్‌ సీక్వెన్సింగ్‌) కోసం కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌ (ఎన్‌ఐబీజీఎం)కు పంపిస్తామని బీఎంసీ కమిషనర్‌ సురేశ్‌ కాకాని మీడియాకు తెలిపారు.

‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ సోకిన బాధితురాలు ఓ 50 ఏళ్ల కాస్ట్యూమ్‌ డిజైనర్‌ అని.. ఆమె ఫిబ్రవరి 10న దక్షిణాఫ్రికా నుంచి ముంబైకి వచ్చారని చెప్పారు. ఆ రోజున జరిపిన పరీక్షలో కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చినప్పటికీ.. రొటీన్‌ టెస్టింగ్‌లో భాగంగా మార్చి 2వ తేదీన నిర్వహించిన పరీక్షలో కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందన్నారు. అయితే ఆమెలో తీవ్ర కొవిడ్‌ లక్షణాలేవీ లేవని పేర్కొన్నారు. ముంబైలో బయటపడిన కేసు ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌దా ? కాదా ? అనే విషయంపై వెంటనే నిర్ధారణకు రాలేమని, పునర్‌ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ జన్యుక్రమ విశ్లేషణ సంస్థ ‘ఇన్సాకాగ్‌’ ఉన్నతాధికార వర్గాలు స్పష్టం చేశాయి.

ఇందుకోసం ఆ శాంపిల్‌ను మరోసారి జన్యుక్రమ విశ్లేషణ చేస్తామని తెలిపాయి. ముంబైలో బయటపడ్డ ఆ కేసుకు సంబంధించిన జన్యుక్రమ విశ్లేషణ సమాచారాన్ని బట్టి.. అది ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌ కాదని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. బాధితురాలి శాంపిల్‌లోని జన్యుక్రమానికి.. ఎక్స్‌ఈ వేరియంట్‌కు చెందిన జన్యుక్రమానికి పొంతన లేదని ఇన్సాకాగ్‌ నిపుణుల విశ్లేషణలో వెల్లడైందని వివరించాయి.

Show comments