దగ్గరుండి మరీ భర్తకు మరో పెళ్లి చేసిన భార్య.. చివర్లో ట్విస్ట్‌ ఊహించలేరు!

దగ్గరుండి మరీ భర్తకు మరో పెళ్లి చేసిన భార్య.. చివర్లో ట్విస్ట్‌ ఊహించలేరు!

తెలుగులో వచ్చిన కన్యాదానం సినిమా రీపిట్‌ సీన్లు.. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తమ జీవిత భాగస్వామి మరో వ్యక్తిని ప్రేమించారు అని తెలియడంతో.. పెద్ద మనసు చేసుకుని.. వారికి మళ్లీ పెళ్లి చేసి ప్రేమికులను ఒక్కటి చేస్తున్నారు కొందరు. ఇక తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి హైదరాబాద్‌లో వెలుగు చూసింది. స్వయంగా తానే దగ్గరుండి మరి.. భర్తకు, అతడు ప్రేమించిన యువతికి వివాహం జరిపించింది ఓ భార్య. కానీ చివర్లో అసలు విషయం తెలిసి ఆ పెళ్లి కుమార్తె బిక్క ముఖం వేసింది. చేసేదేం లేక పోలీసులను ఆశ్రయించింది. ఇంతకు ఏం జరిగింది అంటే..

బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింగాడి కుంట బస్తీకి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం అనగా 2020లో యూసుఫ్‌గూడలోని ఓ డ్యాన్స్‌ అకాడమీలో ట్రైనింగ్ కోసం వెళ్లిన సమయంలో అక్కడ గాంధీ (23) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో.. ఇద్దరు తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయాన్ని తెలిపి.. వారి అంగీకారం పొందారు. ఆ తర్వాత ఇకు కుటుంబాల సమక్షంలో గాంధీకి, బాధితురాలికి నిశ్చితార్థం జరిగింది. అనంతరం వారిద్దరూ కొన్ని రోజుల పాటు సహజీవనంలో ఉన్నారు.

ఇలా ఉండగా.. గాంధీ తనకన్నా ముందే రోజా అనే మరో యువతిని ప్రేమించాడని బాధితురాలికి అనుమానం వచ్చింది. ఈ క్రమంలోనే ఇరు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత వీరి పంచాయితీ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. ఈ క్రమంలో పోలీసులు రోజాను స్టేషన్‌కు పిలిపించారు. ఆమెకు, గాంధీకి మధ్య సంబంధం ఏంటని నిలదీశారు. దాంతో రోజా.. తాను, గాంధీ మంచి స్నేహితులమని.. తాము ప్రేమికులం కాదని పోలీసుల ముందు తెలిపింది. దాంతో గాంధీ కుటుంబం, బాధితురాలి ఫ్యామిలీ రాజీకి వచ్చారు. ఆ తర్వాత ఈ ఏడాది మే 14న గాంధీకి, బాధితురాలికి పెళ్లి చేయాలని పెద్దలు ముహూర్తం నిర్ణయంచారు.

ఈ క్రమంలో గాంధీకి స్నేహితురాలిగా చెప్పుకున్న రోజా దగ్గరుండి అన్ని బాధ్యతలను తీసుకొని గాంధీ, బాధితురాలిల వివాహం జరిపించింది. పెళ్లైన కొన్నాళ్ల వరకు కొత్త జంట సంతోషంగానే ఉంది. అయితే.. కొద్ది రోజుల తర్వాత గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్న యువతి దీని గురించి ప్రశ్నిస్తే.. ఆమెని కొట్టేవాడు. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆరా తీయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనతో వివాహానికి కొన్ని రోజుల ముందే.. రోజా, గాంధీల పెళ్లి జరిగిందని బాధితురాలికి తెలిసింది. ఈ విషయాన్ని దాచడమే కాక.. రోజా స్వయంగా దగ్గరుండి మరీ గాంధీతో తనకు పెళ్లి జరిపించిందని తెలిసి బాధితురాలు షాక్‌కు గురయ్యింది.

ఇలా ఉండగానే రోజా బాధితురాలి ఇంటికి వచ్చింది. తన స్నేహితులతో వచ్చిన రోజా.. తనకు న్యాయం చేయాలంటూ గొడవకు దిగింది. ఆ సమయంలో గాంధీ ఇంట్లో లేడు. తనను మోసం చేయటంతో పాటు ఇంటికి వచ్చి గొడవ చేసినందుకు బాధిత మహిళ.. రోజా, ఆమె స్నేహితులు మీద బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గాంధీ, రోజాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Show comments