Idream media
Idream media
ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీ నేతలు పోరాడితే ప్రజల మద్ధతు లభిస్తుంది. అంతిమంగా ఆ పార్టీకి మేలు జరుగుతుంది. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు తన పార్టీ నేతల నుంచి సాధారణంగా ఇదే ఆశిస్తారు. కానీ ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలుపై కాకుండా అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు, విమర్శలు చేయడం ద్వారా ప్రతిపక్ష పార్టీ నేతలు పట్టు నిలుపుకునేందుకు యత్నిస్తున్నారు. సద్విమర్శలు, ప్రజా సమస్యలపై పోరాడేలా పార్టీ నేతలకు దిశానిర్ధేశం చేయాల్సిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఎవరు ఎంత రచ్చ చేస్తే.. అంత బాగా పని చేసినట్లుగా మార్కులు వేస్తూ వారిని అభినందిస్తున్నారు.
నేడు మంతెన సత్యనారాయణ వంతు…
ఇటీవల అనపర్తి, తాడిపత్రి, విశాఖలో జరిగిన పరిణామాలపై ఆనందం వ్యక్తం చేస్తున్న చంద్రబాబు.. రాష్ట్రమంతటా ఇదే రచ్చ చేయాలంటూ ఆ పార్టీ నేతలను ఉసిగొల్పడం చర్చనీయాంశమవుతోంది. అధినేత దృష్టిలో పడేందుకు తమ్ముళ్లు పోటీపడుతున్నారు. బాబు ఇచ్చిన స్ఫూర్తితో ఒట్టు రాజకీయానికి సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ నేతలను డైవర్ట్ చేసేందుకు, ప్రజల్లో నానేందుకు అవినీతి ఆరోపణలు చేస్తూ, ఒట్టు వేయాలంటూ సవాళ్లు విసురుతున్నారు. తాజాగా విశాఖ జిల్లా మంత్రి అవంతి శ్రీనివాస్పై భూ కబ్జా ఆరోపణలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ.. భూ కబ్జాలకు పాల్పడలేదని మంత్రి ఒట్టు వేయాలని సవాల్ విసిరారు. విశాఖలో 90 శాతం భూ కబ్జాలు అవంతి కనుసన్నల్లోనే జరిగాయని మంతెన ఆరోపించారు. అవంతి ఒట్టు వేస్తానంటే జిల్లాలో ఏ గుడికి రమ్మన్నా వస్తానని, గుడికి కాపోయినా.. అవంతి ఇంట్లోని పూజగదిలో ఒట్టు వేసిన సిద్ధమేనంటూ తమ అధినేత బాబు వద్ద మార్కులు పాందేందుకు యత్నించారు.
దిక్కుతోచని స్థితిలో ప్రతిపక్ష పార్టీ..
వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీకి సరైన అంశం ఒక్కటీ దొరకడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నిద్దామా అంటే.. ఆ అవకాశం సీఎం వైఎస్ జగన్ ఇవ్వడం లేదు. అవినీతి ఆరోపణలు చేద్దామన్నా.. రివర్స్ టెండర్, జుడీషియల్ రివ్యూ ద్వారా పారదర్శకంగా టెండర్లు ఖరారు చేస్తున్నారు. ప్రజలకు, రైతులకు ఏ చిన్న కష్టం, నష్టం వచ్చినా.. తానున్నానే భరోసాను సీఎం వైఎస్ జగన్ కల్పిస్తున్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నేతలు.. తమ రాజకీయ ప్రత్యర్థులపై అవినీతి, భూ కబ్జా ఆరోపణలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్న చంద్రబాబు.. ఏమీ చేయాలో తెలియక.. పార్టీ నేతలు చేస్తున్న పనులే ఘనంగా ఉన్నాంటూ వారిని మరింత ఉసిగొల్పుతుండడం టీడీపీ తాజా పరిస్థితికి అద్దం పడుతోంది.