iDreamPost

రాజ్యాంగాన్ని మేము గౌరవించం.. కానీ ఇతరులకు చెబుతాం

రాజ్యాంగాన్ని మేము గౌరవించం.. కానీ ఇతరులకు చెబుతాం

కొంత మంది రాజకీయ నాయకులు, పార్టీలు.. చట్టాలు, రాజ్యాంగం ఇతరులకే గానీ తమకు వర్తించవన్నట్లుగా ప్రవర్తిస్తుంటాయి. అలాంటి వారిలో ముందు వరసలో ఉంటారు టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చట్టాలు, రాజ్యాంగం అమలు గురించి అసలు తెలియనట్లుగా వ్యవహరించే యనమల రామకృష్ణుడు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం రాజ్యాంగం, చట్టాలు ముందేసుకుని.. వీటిని ప్రభుత్వం పాటించడంలేదంటూ రోజుకో ప్రెస్‌ నోట్‌ విడుదల చేస్తుంటారు.

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతం వివాదం నెలకొంది. వాయిదా వేసిన ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌.. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల్లో సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతున్నాయి. వీరి మధ్యలో పెద్దమనిషి పాత్ర పోషిస్తానంటూ..రూల్స్‌ బుక్‌ పట్టుకుని ముందుకు వస్తున్నారు యనమల రామకృష్ణుడు.

73,74 రాజ్యాంగ సవరణలను ప్రభుత్వం గౌరవించాలి. ఎన్నికల కమిషనర్‌ కోరినప్పుడు అధికారులను బదిలీ చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దే అని ఆర్టికల్‌ 243కే(3) చెబుతోంది. కాబట్టి ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి స్థానిక ఎన్నికల నిర్వహణకు సహకరించాలి.. అంటూ యనమల ఎప్పటిలాగే ఓ ప్రెస్‌ నోట్‌ విడుదల చేశారు. ఈ రూల్స్‌ చెప్పడమే కాదు.. ఎన్నికల వాయిదాకు కొత్త జిల్లాలను సాకుగా చూపడం పలాయన వాదమేనంటూ పనిలో పనిగా ప్రభుత్వంపై ఓ విమర్శ కూడా చేశారు.

Read Also : పంచాయతీ ‘పోరు’ – సీఎస్‌కు నిమ్మగడ్డ మరో లేఖ

మార్చిలో ముమ్మురంగా సాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ఎవరు, ఎందుకు వాయిదా వేశారో అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలు ఎందుకు వద్దంటుందో కూడా ప్రజలందరికీ అవగాహన ఉంది. పూర్వాపరాలతో సంబంధం లేకుండా యనమల చెప్పిన విషయాలు, చేసిన విమర్శనే పరిగణలోకి తీసుకుంటే.. ముందు ఆయన ఒక విషయానికి సమాధానం చెపాలంటున్నారు అధికార పార్టీ నేతలు.

పంచాయతీల పాలకమండళ్లకు గడువు ముగిసింది 2018 ఆగస్టులో. అప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో యనమల ఆర్థిక శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. నాడు ఎన్నికల కమిషనర్‌గా ప్రస్తుతం ఉన్న నిమ్మగడ్డ రమేష్‌కుమారే ఉన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటిలాగా కరోనా లాంటి ఆటంకాలు నాడు లేవు. 73, 74 రాజ్యాంగ సవరణలను గౌరవించేవారైతే.. నాడు పంచాయతీ ఎన్నికలు ఎందుకు జరపలేదనే ప్రశ్నకు యనమల సమాధానం చెపాల్సి ఉంటుంది.

Read Also : రెండు పనులూ నిమ్మగడ్డే చేశారు..!

ఎన్నికలకు భయపడి పారిపోతోందనేది యనమల విమర్శ. 2019 జనరల్‌ ఎన్నికలకు ఇంకా 8 నెలలు ఉన్నా.. నాడు పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు టీడీపీ ఎందుకు సాహసం చేయలేదన్నది యనమలకు తెలియంది కాదంటున్నారు. ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని నాడు కోర్టులో దాఖలైన పిటిషన్లు నేడు కూడా విచారణ దశలో ఉన్నాయంటే దీనికి కారణం ఎవరన్నది సుపరిచితమే. పంచాయతీ పాలక మండళ్ల గడువు ముగిసినప్పుడే యనమల చెప్పినట్లు 73, 74 రాజ్యాంగ సవరణలను నాటి టీడీపీ ప్రభుత్వం గౌరవించి ఉంటే.. ఇప్పుడు ఇలాంటి వివాదాలు తలెత్తేవికావన్నది జగమెరిగిన సత్యం. ప్రజలు గతాన్ని గుర్తుపెట్టుకోలేరులే అన్నట్లుగా యనమల విమర్శలు చేస్తే.. తిరిగి అవి వారికే తగులుతాయని ఎవరూ చెపాల్సిన పని లేదంటున్నారు.

Read Also : మంత్రి కొడాలి నానిపై చర్యలు…

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి