iDreamPost

టీడీపీకి ఫోన్ ట్యాపింగ్‌ భయం

టీడీపీకి ఫోన్ ట్యాపింగ్‌ భయం

అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగుదేశం పార్టీకి ఫోన్ ట్యాంపిగ్‌ భయం వెంటాడుతోంది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్నికల సందర్భంగా జరిగిన ఓటుకు కోట్లు వ్యవహారం టీడీపీ నేతలను పీడకలలా గుర్తుకువస్తోంది. ఆ ఘటన తర్వాత స్వతహాగా చంద్రబాబు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉమ్మడి రాజధానిలో పదేళ్లు ఉండే అవకాశం ఉన్నా.. విధిలేని పరిస్థితిలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు హడావుడిగా మకాం మర్చాల్సి వచ్చింది. అప్పటి వరకూ కేసీఆర్‌పై ఒంటికాలిపై లేచిన చంద్రబాబు ఆ తర్వాత పల్లెత్తు మాట కూడా అనలేకపోయారు.

చంద్రబాబును, తెలుగుదేశం పార్టీని ఇంతటి దారుణ పరిస్థితిలోకి నెట్టిన వ్యవహారం ఓటుకు కోట్లు వ్యవహారం. చంద్రబాబు ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌తో మాట్లాడుతున్న ఫోన్‌ కాల్‌ రికార్డు బయటకు వచ్చింది. మనవాళ్లు బ్రీఫ్డ్‌ మి.. అనే చంద్రబాబు మాటలతో ప్రారంభమైన ఆ ఆడియో సంచలనమైంది. మన వాళ్లు బ్రీఫ్డ్‌ మి అనే పదం బాగా ప్రాచూర్యంలోకి వచ్చింది.

ఓటుకు కోట్లు ఘటనను దృష్టిలో ఉంచుకున్న తెలుగుదేశం నేతలు.. ఇప్పుడు ట్యాపింగ్‌ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్‌ల ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బొండా ఉమామహేశ్వరరావు అనుమానాలు వ్యక్తం చేశారు. వారితోపాటు తమ పార్టీ నేతలందరి ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనీ, తాము ఎవరితో మాట్లాడుతున్నామో తెలుసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

బొండా ఉమా వ్యాఖ్యలతో.. తెలుగుతమ్ముళ్లలో ఓకింత ఆందోళన మొదలైంది. తెలంగాణ ఎపిసోడ్‌ను గుర్తుచేసుకుంటూ వణికిపోతున్నారు. ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది. ఇటీవల ఆ కేసులో నిందితుడుగా ఉన్న రేవంత్‌ రెడ్డి కోర్టు విచారణకు కూడా హాజరయ్యారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ప్రజలుకు కూడా నాటి ఘటనను బొండా తన వ్యాఖ్యలతో గుర్తు చేసినట్లైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి