టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దార్ ఎస్ సలాం నగరం నుంచి బయలుదేరిన ప్రిసీషన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం విక్టోరియా సరస్సులో కూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు.
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 26 మందిని కాపాడామని అధికారులు తెలిపారు. మిగతావారి కోసం గాలింపుచర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వంద మీటర్ల ఎత్తులో విమానం ఉండగా వర్షం కురవడం సహా ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమానం కుప్పకూలినట్లు తెలుస్తోంది.
గతంలో..
గతంలో ఉత్తర టాంజానియాలో సఫారీ కంపెనీ కోస్టల్ ఏవియేషన్కు చెందిన విమానం కూలి 11 మంది దుర్మరణం చెందారు. మార్చి 2019లో అడిస్ అబాబా నుండి నైరోబీకి వెళ్లే ఇథియోపియన్ ఎయిర్లైన్స్ విమానం టేకాఫ్ అయిన ఆరు నిమిషాల తర్వాత ఇథియోపియన్ రాజధానికి ఆగ్నేయ ప్రాంతంలో కుప్పకూలి 157 మంది మరణించారు. 2007లో కెన్యా ఎయిర్వేస్ విమానం ఐవరీ కోస్ట్ నగరం అబిజాన్ నుండి కెన్యా రాజధాని నైరోబీకి వస్తున్న సమయంలో కుప్పకూలి 114 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు.
2000లో అబిజాన్ నుండి నైరోబికి వెళ్లే మరో కెన్యా ఎయిర్వేస్ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలే అట్లాంటిక్ మహాసముద్రంలో కూలి 169 మంది మరణించగా, 10 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఏడాది కిందట ఉత్తర టాంజానియాలో జరిగిన విమాన ప్రమాదంలో 10 మంది యూస్ పర్యాటకులతో సహా ఒక డజను మంది మరణించారు.