ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఒకటి. ఉభయ తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు మెగా టోర్నీలో ఈ జట్టును ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఎస్ఆర్హెచ్ గెలవాలని దృఢంగా కోరుకుంటున్నారు. అయితే గత కొన్ని సీజన్లుగా ఈ టీమ్ మాత్రం ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ అడుగుపెట్టి పదేళ్లు పూర్తయింది. అయితే దశాబ్ద కాలంలో రైజర్స్ ఒక్కసారే కప్ను గెలుచుకుంది. 2016లో ట్రోఫీని నెగ్గిన ఆరెంజ్ ఆర్మీ.. 2018లో రన్నరప్గా నిలిచింది. 2013, 2017, 2019, 2020ల్లో ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. కానీ గత మూడు సీజన్లుగా మాత్రం ఘోరంగా ఆడుతోంది.
గత మూడు సీజన్లలో ఎస్ఆర్హెచ్ కనీసం లీగ్ దశను కూడా దాటలేకపోయింది. ఈ ఏడాది అయితే టేబుల్లో కింది నుంచి అగ్రస్థానంలో నిలిచి పరువు పోగొట్టుకుంది. కప్పై ఫ్యాన్స్ పెట్టుకున్న గంపెడాశల్ని నీరుగార్చింది. ఇందులో ప్లేయర్ల ఆటతీరుతో పాటు జట్టు మేనేజ్మెంట్ను కూడా తప్పుబట్టక తప్పదు. అందుకే టీమ్ హెడ్ కోచ్ బ్రియాన్ లారా తీవ్రంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. లారాలో అస్సలు సీరియస్నెస్ కనిపించడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోయినా లారా నవ్వుతూ కనిపించిన దృశ్యాలు ఈ ఐపీఎల్ టైమ్లో బాగా వైరల్ అయ్యాయి. వరుస ఓటములు ఎదురైనా లారా ఏమీ చేయలేకపోవడంతో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అతడిపై గుర్రుగా ఉందని తెలుస్తోంది.
ఐపీఎల్-2024 సీజన్కు ముందు టీమ్ మొత్తాన్ని మరోమారు ప్రక్షాళన చేయాలని సన్రైజర్స్ భావిస్తోందట. అందులో భాగంగానే హెడ్ కోచ్ లారా మీద కూడా వేటు వేయనున్నట్లు క్రికెట్ వర్గాల సమాచారం. మరోవైపు వెస్టిండీస్ క్రికెట్ను చక్కదిద్దే బాధ్యతను తీసుకున్న లారా.. ఎస్ఆర్హెచ్ కోచింగ్పై అంతగా మొగ్గుచూపడం లేదని వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి ప్లేసులో హెడ్ కోచ్ పదవికి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను తీసుకోవాలని సన్రైజర్స్ ఫిక్స్ అయిందట. ఈ మేరకు వీరూను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సంప్రదించిందట. సెహ్వాగ్ నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. వీరూ కోచ్గా వస్తే ఎస్ఆర్హెచ్కు తిరుగుండదని ఫ్యాన్స్ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే, గతంలో పంజాబ్ కింగ్స్ మెంటార్గా నాలుగు సీజన్ల పాటు సెహ్వాగ్ పనిచేశాడు.