iDreamPost

చరణ్ ఫ్యాన్స్ కు సెంటిమెంట్ టెన్షన్

చరణ్ ఫ్యాన్స్ కు సెంటిమెంట్ టెన్షన్

ఎంత కాదనుకున్నా సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి. పైకి కొన్ని సిల్లీగా కనిపించినా సరే వీటిని సిన్సియర్ గా ఫాలో అయ్యే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక పెద్ద స్టార్ హీరో తన కొత్త సినిమా ఓపెనింగ్ కి ఎప్పుడూ హాజరు కాడు. ఎందుకంటే సెంటిమెంట్ అంతే. వీటిని అభిమానులు కూడా బలంగా నమ్ముతారు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న ఆర్ఆర్ఆర్ తర్వాత జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది.

గౌతమ్ ప్రస్తుతం జెర్సి హిందీ రీమేక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అది పూర్తి కాగానే కొత్త ప్రాజెక్ట్ ఏదీ కమిట్ కాలేదు కాబట్టి చరణ్ తోనే ఉండొచ్చని గట్టి టాక్. ఇక్కడేం సెంటిమెంట్ ఉందని డౌట్ వస్తోంది కదా. చూద్దాం. చరణ్ రెండో సినిమా మగధీర దర్శకుడు రాజమౌళి. అది ఎంత పెద్ద చరిత్ర సృష్టించిందో తెలిసిందే. దాని తర్వాత చేంజ్ కోసమని బొమ్మరిల్లు భాస్కర్ తో ఆరంజ్ చేస్తే అది దారుణంగా డిజాస్టర్ అయ్యింది. ఆ సినిమా సంగీతానికి పేరొచ్చింది కానీ కంటెంట్ పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది . భాస్కర్ కది మూడో సినిమా. బొమ్మరిల్లు, పరుగు హిట్టయ్యాక పిలిచి మరీ ఈ ఛాన్స్ ఇచ్చారు. సెన్సిబుల్ దర్శకుడు కావడంతో చరణ్ రేంజ్ కమర్షియల్ హీరోని డీల్ చేయలేకపోయాడని కామెంట్స్ వచ్చాయి.

ఇప్పుడు ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళినే. తర్వాత గౌతమ్ తిన్ననూరి అంటున్నారు. ఇతను తీసింది కూడా రెండు సినిమాలే. సుమంత్ మళ్ళీ రావా, నాని జెర్సీ రెండూ ఎమోషనల్ జర్నీసే. మాస్ ని కాదు కానీ వీటిని ప్రత్యేకంగా ఇష్టపడే టార్గెట్ ఆడియన్స్ ని మెప్పించాయి. మరి ఇలాంటి డైరెక్టర్ చరణ్ ని ఎలా చూపిస్తాడనే అనుమానం ఫ్యాన్స్ లో రావడం సహజం. అందుకే మగధీర నాటి రోజులను గుర్తు చేసుకుంటున్నారు. అయితే గౌతమ్ ఎలాంటి సబ్జెక్టు రెడీ చేశాడో తెలియదు కాబట్టి అప్పుడే ఒక కంక్లూజన్ కు రాలేం కానీ ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మల్టీ స్టారర్ తర్వాత మూవీ కాబట్టి ఒత్తిడి అయితే ఖచ్చితంగా ఉంటుంది. అధికారికంగా ప్రకటన అయితే రాలేదు కానీ ఆల్మోస్ట్ ఓకే అయ్యిందని ఇన్ సైడ్ న్యూస్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి